ఒకరు కాదు, ఇద్దరు కాదు.. మూడొందల మందికి పైగానే ‘గుర్తు తెలియని అనారోగ్య సమస్యకు’ గురవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశంపై చర్చ జరుగుతోంది. నిజానికి, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఇది. నీరు కలుషితమైందనో, గాలి కలుషితమైందనో తెలిస్తే.. అది వేరే లెక్క. ఇంతవరకు ఎందుకు అనారోగ్యం బారిన ప్రజలు పడుతున్నారో తెలియని పరిస్థితి. ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది.? అన్నదానిపై ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. ‘ఆల్ ఈజ్ వెల్..’ అంటోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. కానీ, ఆసుపత్రులు మాత్రం అనుమానాస్పద అనారోగ్య సమస్యతో చేరుతున్న రోగుల కారణంగా నిండిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అయితే, అనధికారికంగా ఎంతమంది చనిపోయారు.? అన్నదానిపై భిన్న వాదనలు తెరపైకొస్తున్నాయి. అయితే, ఇలాంటి సందర్భాల్లో సంయమనం అవసరం. సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఈ వ్యవహారంపై పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. కానీ, ప్రభుత్వం చెప్పే లెక్కలే అధికారికం. సంయమనం పాటించకుండా, నెగెటివ్ వార్తల్ని ప్రచారంలోకి తీసుకొస్తే.. ప్రజల్లో మరింత భయాందోళన పెరిగిపోతుంది.
దాదాపు 400 మంది బాధితులు.. చిన్న విషయమా.?
అయితే, దాదాపు 400 మంది ఆసుపత్రుల పాలవడం.. అదీ ఓ ప్రాంతానికి చెందినవారే కావడంతో.. పరిస్థితి తీవ్రత చాలా ఎక్కువేనని చెప్పక తప్పదు. మరోపక్క, అనారోగ్యం నుంచి చాలామంది కోలుకుంటుండడం కాస్త ఊరట. వాంతులు, మూర్ఛ రావడం.. వెనుక కారణలేంటి.? అన్నది వైద్య నిపుణులకూ అంతు చిక్కడంలేదు. రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు.. సీటీ స్కాన్ వంటి అత్యాధునిక వైద్య పరీక్షలూ చేస్తున్నారు. ఇంతేనా, నీటి నమూనాల్నీ, గాలి నమూనాల్ని కూడా పరీక్షిస్తున్నారు. ఎన్ని చేసినా, అన్నిట్లోనూ రిజల్ట్ నార్మల్గానే వుంటోందట.
అప్పుడు విశాఖ.. ఇప్పుడు ఏలూరు.!
విశాఖలో కొన్నాళ్ళ క్రితం ఓ పరిశ్రమలో ప్రమాదకర గ్యాస్ లీక్ జరిగింది. జనం పిట్టల్లా రాలిపోయారు. చనిపోయినవారి సంగతి పక్కన పెడితే, అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చేరి, కోలుకున్నవారు.. తదనంతరం అనేక అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నా, వారిని పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ఈ తరహా ప్రమాదాల్లో సమస్యలు జీవితాంతం వెంటాడుతుంటాయి బాధితుల్ని. ప్రభుత్వం పెద్ద మనసుతో వ్యవహరించాలి. పరిశ్రమని అక్కడి నుంచి తొలగించాలన్న డిమాండ్ పట్ల ప్రభుత్వ నిర్ణయం ఏంటన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే.
అప్పుడు అలా విమర్శ, ఇప్పుడు ఇలా సమర్థన
చంద్రబాబు హయాంలో తూర్పుగోదావరి జిల్లాలో ఓన్జీసీ గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో నానా యాగీ చేసింది అప్పటి ప్రతిపక్షం. కానీ, ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో జరుగుతున్న వరుస ఘటనల్ని ఎలా అర్థం చేసుకోవాలి.? ‘ప్రభుత్వం అత్యద్భుతంగా పనిచేస్తోంది..’ అని వైసీపీ నేతలు చెప్పుకుంటే సరిపోదు. ఈ తరహా ఘటనలు రిపీట్ కాకూడదు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని వేళలా అప్రమత్తంగా వుంటే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశమే వుండదు.