జరుగుతున్న ఎన్నికల్లో కేంద్రప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన ఆలోచన ఉందని అంటున్నారు. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్ధాయి నుండి అందుతున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం ఏ ఒక్క కూటమికీ మెజారిటీ వచ్చే అవకాశాలు లేదు. దాంతో రెండు కూటములు లేకపోతే కూటములకు నేతృత్వం వహిస్తున్న బిజెపి, కాంగ్రెస్ లు కొత్త మిత్రుల కోసం వెతుక్కుంటున్నాయి.
ఇటువంటి నేపధ్యంలోనే ప్రాంతీయ పార్టీలపై ఆధారపడే ప్రభుత్వమే ఏర్పడాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు. ఎన్డీఏ కానీ యూపిఏ కానీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ప్రాంతీయపార్టీలపై ఆధారపడక తప్పేట్లు లేదు. ఆ ఆధారపడేదేదో వైసిపిలాంటి పార్టీలపై ఆధార పడాల్సిన పరిస్ధితులు వస్తేనే తన డిమాండ్లు నెరవేరుతాయన్న విషయం జగన్ కు బాగా తెలుసు.
జగన్ ముందున్న డిమాండ్ మొదటి నుండి ఒకటే. ప్రత్యేకహోదానే ప్రధాన డిమాండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికైతే సంఖ్యాబలం తగ్గినా కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం మళ్ళీ ఎన్డీఏకే ఉందని అర్ధమవుతోంది. అయితే ఏపికి ప్రత్యేకహొదా ఇచ్చే విషయంలో నరేంద్రమోడి వైఖరేంటో తెలీదు. కాబట్టి ఎన్డీఏ వైపు జగన్ మొగ్గు చూపాలంటే ముందు హోదా విషయంలో మోడి వైఖరి తెలియాలి.
మద్దతిచ్చే విషయంలో మోడి నుండి జగన్ అదే కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందు హోదా తర్వాతే కేంద్ర మంత్రివర్గంలో భాగస్వామ్యం అని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. అందుకే వైసిపి మద్దతుపై ఆధారపడే పరిస్ధితులే రావాలని జగన్ కోరుకుంటున్నారు.
