ఏ ముహూర్తంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీస్వీకారం చేశాడో గానీ, హైకోర్టుకు, ప్రభుత్వానికి మధ్య రోజూ ఘర్షణే జరుగుతున్నది. ప్రభుత్వం ఒక చట్టం చేసినా, ఒక జీవో ఇచ్చినా వెంటనే హైకోర్టు దానిమీద స్టే ఇవ్వడమో లేక కొట్టేయడమో చేస్తున్నది. ఈ ఎదురుదెబ్బలు తట్టుకోలేక సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్ మోహన్ రెడ్డి రిటెన్ కంప్లైంట్ చేసినా ఫలితం కనిపించడం లేదు. రోజు రోజుకు హైకోర్టు చాలా కటువైన వ్యాఖ్యలు జగన్ ప్రభుత్వం మీద చేస్తున్నది. ఇప్పటికీ కోర్టుతో మొట్టికాయలు వేయించుకోవడంలో జగన్ సెంచరీ కొట్టాడని ప్రజలు నవ్వుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు అని సమాచారం.
ప్రభుత్వం ఇచ్చే జీవోలను కొట్టేయడమే కాదు..జగన్ కు వ్యతిరేకంగా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేస్తుండటం జగన్ కు మింగుడుపడని పరిణామం. నిన్న రాజధాని రైతులకు సంకెళ్లు వెయ్యడం మీద హైకోర్టు తీవ్రంగా స్పందించడమే కాక వారికి బెయిల్ కూడా మంజూరు చేసింది. ఎస్సీలమీదనే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం పట్ల తీవ్రంగా ఆక్షేపించి పోలీసులకు అక్షింతలు వేసింది. రైతుల మీద కేసులు ఎలా ఉన్నప్పటికీ వారికి సంకెళ్లు వెయ్యడం మాత్రం రైతులు, మేధావులు, హక్కులసంఘాలవారు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసుల అత్యుత్సాహం కారణంగా తమకు అప్రతిష్ట వస్తున్నదని వైకాపా నాయకులు వాపోతున్నారు.
అయితే కోర్టు ఎంత తీవ్రంగా ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నప్పటికీ జగన్ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు జగన్ ను సమర్ధిస్తూ ప్రకటనలు చెయ్యడం లేదు. తమ సలహాలకు జగన్ విలువ ఇవ్వరని, అసలు తమతో ఏ విషయాన్నీ చర్చించరని, కేవలం ఒకరిద్దరు సలహాదారులు, అధికారులు ఇచ్చే సలహాలనే ఆయన పాటిస్తారని అందువల్లనే కోర్టులో ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, న్యాయస్థానాల విషయంలో తెలుగుదేశం మీదికి నెపాన్ని నెట్టేస్తూ ఎంతోకాలం గడపలేమని ఆంతరంగిక సంభాషణల్లో వైకాపా నాయకులు చెప్పుకుంటున్నారట. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్య, వైఎస్ రాజశేఖరరెడ్డితో సాన్నిహిత్యం కలిగిన సీనియర్ నాయకులు కొందరు మాట్లాడుతూ మంత్రులు, నాయకుల సలహాలు విన్నా వినకపోయినా, కనీసం వారితో ఇబ్బందులను పంచుకునేవారని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని వాపోతున్నారు. మంత్రులకు సైతం అసలు ముఖ్యమంత్రి దర్శనమే దొరకదని బాధపతుడుతున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ మంత్రి ముఖ్యమంత్రి ముఖం చూసి దాదాపు ఏడాది దాటిందట. కేబినెట్ సమావేశాల్లో మినహా ముఖ్యమంత్రి ముఖం చూడడానికే అనుమతి ఇవ్వరట. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కు మద్దతుగా ఏమి మాట్లాడాలని నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
ఏమైనప్పటికీ మొదట్లో కొన్నాళ్ళు సరిపుచ్చుకోవడం కుదురుతుందేమో కానీ పదేపదే కోర్టు నుంచి ఎదురుదెబ్బలు తగులుతుంటే ప్రభుత్వం తప్పులు చేస్తున్నదేమో అని భావించే దశ వస్తుందని, ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.