పార్టీలో చాలామంది నాయకులున్నారు.. ఎవరో ఒకరితో ఆ మాట చెప్పించేసి వుండాల్సింది. కానీ, తానే స్వయంగా ఆ విషయాన్ని వెల్లడించారు. తాను చెబుతున్నదానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి పూర్తి స్పష్టత వుండొచ్చుగాక. కానీ, దానికి సమయం, సందర్భం కూడా అవసరమే. కర్నూలు జిల్లాలో మైనార్టీ వర్గానికి చెందిన ఓ కుటుంబం ‘రాజకీయ – పోలీసు’ వేధింపుల కారణంగా బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం చనిపోయేముందు సెల్పీÛ వీడియోలో తమ ఆవేదన వెల్లగక్కుకుంది.
ప్రభుత్వ చర్యల్ని అభినందించాల్సిందే..
విషయం వెలుగు చూడగానే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీరియస్ యాక్షన్కి ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్ని అరెస్ట్ చేశారు. అనంతరం, విషయం కోర్టు పరిధిలోకి వెళ్ళడం సహజమే. కోర్టు, ఆ పోలీసులకు బెయిల్ ఇచ్చింది. ఇక్కడే అసలు కథ మొదలయ్యింది. బెయిల్ రావడానికి కృషి చేసింది టీడీపీకి చెందిన న్యాయవాది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆరోపించారు. దాంతో, వివాదం కొత్త మలుపు తిరిగింది.
న్యాయవాదులకి రాజకీయాలుంటాయా.?
న్యాయవాదులైతేనేం, వారికీ రాజకీయాల పట్ల ఆసక్తి వుండొచ్చు. టీడీపీ నేత అయినంతమాత్రాన, లాయర్గా తన వృత్తిని మానుకోరు కదా.! ఈ చిన్న పాయింట్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ఎందుకు మిస్ అయ్యారు.? అని వైసీపీ వర్గాల్లోనూ అంతర్గతంగా ఆశ్చర్యం వ్యక్తమవుతోందట. ‘మా శక్తి సరిపోవడంలేదు.. టీడీపీ, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం వలన..’ అన్న మాట కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని వుండకూడదు.
ప్రభుత్వం పడ్డ కష్టం బూడిద పాలైనట్లేనా.?
పోలీసులపై ప్రభుత్వం ఇలాంటి సంఘటనల్లో చర్యలు తీసుకోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ, నిందితులకు బెయిల్ రాకుండా వుండాలంటే, గట్టిగా కేసులు పెట్టి, ఇంకా గట్టిగా వాదనలు వినిపించాల్సింది ముమ్మాటికీ ప్రభుత్వమే. బెయిల్ రావడం తప్పిదం.. అన్నట్లు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, కష్టం ఎందుకు బూడిద పాలయ్యిందన్నదానిపై ‘పోస్ట్మార్టం’ చేసి వుండాల్సింది. ‘పోరాడుతాం’ అన్న మాట మంచిదే. కానీ, అక్కడిదాకా పరిస్థితి రాకుండానే తగిన చర్యలు తీసుకుని వుండాల్సిందేమో.!