ఆంధ్రపదేశ్లో విగ్రహ రాజకీయం ఎందుకు తెరపైకొచ్చింది.? దేవతా మూర్తుల విగ్రహాలు ఎందుకు ధ్వంసమవుతున్నాయి.? రథాలు ఎందుకు దగ్ధమవుతున్నాయి.? ఇవన్నీ ఇప్పటికైతే మిలియన్ డాలర్ ప్రశ్నలే. ఎవరు చేస్తున్నారు.? అన్నది తేల్చలేక వైఎస్ జగన్ ప్రభుత్వం దాదాపు చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. రోజులు గడుస్తున్నాయ్.. నెలలు గడుస్తున్నాయ్.. ఆయా కేసులో దోషులెవరన్నదీ తేలలేదు. కానీ, రాజకీయం మాత్రం బహు చక్కగా నడుస్తోంది. ‘రాత్రిళ్ళు విగ్రహాలు ధ్వంసం చేస్తారు.. పగలు దేవాలయాల సందర్శన అంటూ, ఆందోళనలు చేస్తారు..’, ‘రథాలు తగలబెడతారు..
రథ యాత్రలు చేస్తారు..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను రాజకీయ దుమారానికి కారణమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా, ఆయా కేసుల విచారణపై తీవ్ర ప్రభావం పడుతుందనీ, దోషులెవరో ముఖ్యమంత్రే చెప్పేశాక, విచారణ సజావుగా ఎలా సాగుతుందని టీడీపీ, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ సంగతేమోగానీ, ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరి.. ఆయన యెత్తుకున్న హిందుత్వ ఎజెండా, టీడీపీకి మైనార్టీలు, క్రిస్టియన్లను దూరం చేస్తోంది. మూకుమ్మడిగా ఆయా వర్గాలకు చెందిన నేతలు టీడీపీకి రాజీనామా చేస్తుండడం గమనార్హం. టీడీపీకి మైనార్టీలే కాదు, క్రిస్టియన్లూ ఇన్నాళ్ళూ అండగా నిలిచారు. క్రిస్టియన్ ఓటు బ్యాంకునీ, మైనార్టీ ఓటు బ్యాంకునీ వైసీపీ తెలివిగా తన వైపుకు తిప్పకుంది. హిందూ ఓటు బ్యాంకు అనేది ఆయా పార్టీల మధ్య డివైడ్ అవుతూ వచ్చింది. ఇకపై ఆ హిందూ ఓటు బ్యాంకు కూడా బీజేపీ – జనసేన వైపు వెళితే, టీడీపీ పరిస్థితి ఏంటి.? అన్న చర్చ జరుగుతోంది. నిజానికి, రాజకీయాల్లో ఇలాంటి చర్చ అస్సలేమాత్రం సబబు కాదు. మనది లౌకిక దేశం. ఇక్కడ, ఇలాంటి చర్చలు అవాంఛనీయం. కానీ, రాజకీయ పార్టీలు కులాల వారీగా, మతాల వారీగా రాజకీయాలు చేస్తూనే వున్నాయి. ఎలా చూసినా, టీడీపీ ఖేల్ ఈసారి పక్కాగా ఖతం అయిపోయినట్లేనని ఆంధ్రపదేశ్లో రాజకీయ విశ్లేషకులే కాదు, ఆఫ్ ది రికార్డ్గా టీడీపీ నేతలూ ఓ నిర్ణయానికి వచ్చేశారట.