Pahalgam Terror Attack: పహల్గాం దాడి తర్వాత ఐరాస కదిలింది.. మధ్యవర్తిత్వానికి సిద్ధమా?

భారత్ సైనిక చర్య జరుగుతుందని పాకిస్థాన్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి స్పందించింది. సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ మంగళవారం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిపై ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి ప్రాధాన్యతపై దృష్టి పెట్టాలని సూచించారు.

జైశంకర్ సంభాషణలో గుటెర్రస్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారని భారత విదేశాంగ మంత్రి వెల్లడించారు. “దాడికి పాల్పడినవారిని, సహకరించిన వారిని శిక్షించాల్సిన అవసరం ఉందన్న విషయంపై ఇద్దరం ఏకీభవించాం,” అని జైశంకర్ స్పష్టం చేశారు. ఈ అంశంలో భారత్ తన దృఢమైన నిబద్ధతను వ్యక్తం చేసిందన్నారు. ఇక పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ తమపై భారత్ చేస్తున్న ఆరోపణలు అసత్యమని, తటస్థ దర్యాప్తు జరగాలని గుటెర్రస్‌కు విజ్ఞప్తి చేశారట.

కశ్మీర్ సమస్యను ఐరాస తీర్మానాల ప్రకారం పరిష్కరించాలన్న పాకిస్థాన్ నిబంధనను మరోసారి ఆయన ప్రస్తావించారు. “శాంతికి కట్టుబడి ఉన్నాం కానీ సార్వభౌమాధికారంపై ఎవరు దెబ్బతీశారో తగిన జవాబు ఇస్తాం,” అని షరీఫ్ హెచ్చరించారు. యూఎన్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ కూడా ఈ ఫోన్ సంభాషణలు జరిగాయని ధృవీకరించారు.

“పహల్గాం దాడిని సెక్రటరీ జనరల్ ఖండించారు. చట్టబద్ధ మార్గాల్లో న్యాయం జరిగేందుకు యూఎన్ అవసరమైనంత వరకు మద్దతుగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాం,” అని తెలిపారు. భారత్ వైఖరిలో మాత్రం స్పష్టత ఉంది. ఉగ్రవాదంపై అసహనం, న్యాయ ప్రక్రియ పట్ల నిబద్ధత స్పష్టంగా వినిపిస్తోంది. ఇక పాకిస్థాన్ యూఎన్ చర్చలతో పరిణామాలు ఏవిధంగా మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

షుగర్ వల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుందా? | పడకగదిలో ఎప్పుడు 20 ఏళ్ళ యువకుడిలా ఉండొచ్చా?| Telugurajyam