జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన అమానుష ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో 26 మంది అమాయక పర్యాటకులు మృతి చెందడం అంతర్జాతీయంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పౌరులపై జరిగిన ఈ దాడి మానవతా విలువలను తుంచేస్తుందని ఐరాస స్పష్టం చేసింది.
ఈ విషయంపై ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ మీడియాతో మాట్లాడారు. సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఈ ఘటనను ఎంతో ఆందోళనతో పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎలాంటి రూపంలోనైనా పూర్తిగా ఖండనీయమని, పౌరులపై దాడిని అస్సలు సహించలేమన్నారు. ఇలాంటి పరిణామాలు దక్షిణాసియాలో శాంతి స్థితిని దెబ్బతీయవచ్చని అన్నారు.
భారత్, పాకిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరుదేశాలు సంయమనం పాటించాలని ఐరాస విజ్ఞప్తి చేసింది. “సమస్యల పరిష్కారం కోసం శాంతియుత చర్చలే మార్గం. రెండు దేశాలు మాటల ద్వారానే పరిష్కారానికి రాగలరని మేము ఆశిస్తున్నాం” అని స్టీఫెన్ తెలిపారు. యుద్ధం మార్గం కాదని, ద్వైపాక్షిక చర్చలే శాశ్వత పరిష్కారానికి దారి తీస్తాయని ఐరాస అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇక ఈ దాడికి ప్రతీకార చర్యగా భారత్ పాక్ పౌరుల వీసాలు రద్దు చేయడం, సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం వంటి చర్యలు తీసుకుంది. దీనిపై విలేకరులు ప్రశ్నించగా, “ఇలాంటి వేళ అంతర్జాతీయ ఒప్పందాలపై ఇరుదేశాలు బాధ్యతతో వ్యవహరించాలి. సమస్యల పరిష్కారానికి దారి తీయకుండా ఉద్రిక్తతలు పెంచే చర్యలు నివారించాలి” అని స్టీఫెన్ డుజారిక్ అన్నారు.