Subhanshu Shukla: అంతరిక్షానికి శుభాన్షు శుక్లా: 40 ఏళ్ళ తర్వాత మరో భారతీయుడి చరిత్ర!

భారత అంతరిక్ష చరిత్రలో మరో కీలక ఘట్టానికి సమయం దగ్గరపడింది. వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లనున్న తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. “గగన్‌యాన్‌కు ముందు అంతరిక్ష ప్రయాణంలో ఇది కీలక అడుగు. శుభాన్షు ప్రయాణం ద్వారా భారత్ ఒక కొత్త శిఖరాన్ని అధిరోహించబోతోంది” అని ఆయన పేర్కొన్నారు.

శుభాన్షు శుక్లా గత ఎనిమిది నెలలుగా అమెరికాలో నాసా, ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియమ్ స్పేస్ సంస్థల వద్ద ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. Ax-4 పేరుతో జరిగే ఈ వాణిజ్య యాత్రలో భాగంగా, ఆయన ఫ్లొరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి బయలుదేరుతారు. క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌లో నలుగురు వ్యోమగాములు ప్రయాణించనుండగా, శుభాన్షు ఈ మిషన్‌కు పైలట్‌గా వ్యవహరించనున్నారు.

ఈ ప్రయోగానికి భారత ప్రభుత్వం సుమారు 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు సమాచారం. శుభాన్షు సరసన నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్‌గా ఉంటారు. పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కి, హంగేరీకి చెందిన టిబోర్ కపు మిషన్ స్పెషలిస్టులుగా బృందంలో భాగమవుతారు. నాలుగు దశాబ్దాల తర్వాత, రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి భారతీయుడిగా శుభాన్షు చరిత్రలో నిలవనున్నారు.

ఈ ప్రయాణం కేవలం చరిత్రాత్మకమేగాక, భారత గగన్‌యాన్ మిషన్‌కు ఒక కీలక టెస్టు రన్‌గా ఇస్రో చూస్తోంది. అంతరిక్షంలో వాస్తవ అనుభవం, ప్రత్యేక పరిస్థితుల్లో మానవ సహన సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం.. ఇలా అన్ని కూడా ఈ ప్రయోగం ద్వారా డేటాగా చేరనున్నాయి. గగన్‌యాన్ కోసం ఎంపికైన భారత వ్యోమగాములకు శుభాన్షు ప్రదర్శన ఒక మార్గదర్శకంగా నిలవనుంది. ఈ ప్రయాణంతో శుభాన్షు శుక్లా పేరు భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించనుంది. 1984లో రాకేష్ శర్మ “హిందుస్తాన్ ఔర్మస్త” అన్న మాటలతో దేశాన్ని గర్వించగొల్పినట్లే, ఇప్పుడు శుభాన్షు ప్రయాణం కూడా భారత అంతరిక్ష కలలకు రెక్కలు తగిలించబోతోంది.

టీసీఎస్ భూ కేటాయింపులో అవినీతి || Analyst Ks Prasad EXPOSED TCS Gets Vizag Land For 99 Paise || TR