బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై కేంద్ర మంత్రి, బీజేపీ నాయకులు బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ బీజేపీ గుర్తు అయిన ‘తామర పువ్వు’పై చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గుర్తు ‘కారు’ను లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
బీజేపీ ఎన్నికల గుర్తు అయిన తామర పువ్వుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బండి సంజయ్ “బుద్ధి సరిగ్గా లేని వారే తామర పువ్వు దేవుడి పూజకు పనికిరాదని మాట్లాడుతారు. బ్రహ్మ, విష్ణువు, లక్ష్మీదేవి, సరస్వతీ దేవి అందరూ తామర పువ్వుతో సంబంధం ఉన్నవారే” అని పేర్కొన్నారు. అంతేకాకుండా, తామర పువ్వు గొప్పతనాన్ని వివరిస్తూ “నీరు ఎంత పెరిగినా తామర పువ్వు నీటికి అంటకుండా పైనే ఉంటుంది. మా పార్టీ కూడా అలాగే అన్ని సమస్యలను అధిగమించి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది” అని అన్నారు. ఈ విషయం తెలుసుకోవాలంటూ కేటీఆర్కు హితవు పలికారు.

అనంతరం, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని ఉద్దేశిస్తూ బండి సంజయ్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “కారు గుర్తు ఉన్న పార్టీ వాళ్లు తమ పరిస్థితిని తాము చూసుకోవాలి. వాళ్ల కారు ఇప్పటికే రిపేర్కు కూడా పనికిరాకుండా షెడ్డులో పడింది” అని ఎద్దేవా చేశారు. కనీసం ఆ కారును సెకండ్ హ్యాండ్లో కొనడానికి కూడా ఎవరూ సిద్ధంగా లేరంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బండి సంజయ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తెలంగాణ రాజకీయాల్లో మరింత వేడి పెంచింది. రాజకీయ పార్టీల గుర్తులతో ముడిపడిన ఈ వాదోపవాదాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

