Undavalli Arun Kumar: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, రాబోయే 2029 ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా “కూటమి” ఐక్యతపైనే ఆధారపడి ఉంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించారు. కూటమి విడిపోతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తిరుగుండదని ఆయన స్పష్టం చేశారు.
2029 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా కొనసాగితేనే పోటీ రసవత్తరంగా ఉంటుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
2014 తరహాలో హోరాహోరీ పోరు (Tough Fight) తప్పదు. 2019 ఫలితాలు పునరావృతమవుతాయి. జగన్కు విజయం ఏకపక్షం (One-sided) అవుతుంది. ప్రస్తుతం జగన్ గ్రాఫ్ పెరిగిందని, అదే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.
కూటమి కొనసాగుతుందా లేదా అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారం కోసం బీజేపీ ఏ ఎజెండాతోనైనా ముందుకు వెళ్తుందని, అవసరాన్ని బట్టి పార్టీలు కలవడం, విడిపోవడం రాజకీయాల్లో సహజమని ఆయన గుర్తు చేశారు.
2024 ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. “రాజమండ్రి జైలులో చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలిసిన రోజే కూటమి విజయం ఖరారైంది. వారిద్దరూ కలిసిన వెంటనే వార్ వన్ సైడ్ అయిపోయింది” అని విశ్లేషించారు. అయితే, భవిష్యత్తులో చంద్రబాబు వారసుడిగా లోకేష్ పేరు తెరపైకి వస్తే, కాపు సామాజిక వర్గ ఓట్లలో చీలిక వచ్చే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.

తిరుమల లడ్డూ వివాదం, వైఎస్ రాజశేఖరరెడ్డి మతంపై వస్తున్న విమర్శలపై ఉండవల్లి ఘాటుగా స్పందించారు.
“వైఎస్సార్ సర్టిఫికెట్ ప్రకారం క్రిస్టియన్ కావొచ్చు, కానీ ఆయన హిందూ సంప్రదాయాలను కూడా గౌరవించేవారు. గతంలో అన్నవరంలో ఆయన గంటన్నర పాటు కూర్చుని సత్యనారాయణ వ్రతం చేశారు. పాదయాత్ర తర్వాత ఆయన, జగన్ ఇద్దరూ తిరుమలకు నడిచి వెళ్లారు.”
రాజ్యాంగంలో ‘రాజధాని’ అనే పదానికి ప్రత్యేక నిర్వచనం లేదని ఉండవల్లి పేర్కొన్నారు. 2014లో అమరావతిని ప్రకటించినప్పుడే వైసీపీ తన అభ్యంతరాలను బలంగా చెప్పాల్సిందని, ఆ తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చి గందరగోళానికి దారితీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తానికి ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. 2029 నాటికి సమీకరణాలు ఎలా మారుతాయో వేచి చూడాలి.

