భారత్, పాకిస్థాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీపై వచ్చిన ఆరోపణలపై తాజాగా స్పందన వచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాలు సైనిక మోహరింపులు చేపట్టడంతో టర్కీ నుంచి పాకిస్థాన్కు ఆయుధాలు తరలించినట్టు పలు కథనాలు వెలువడ్డాయి.
వార్తల ప్రకారం, ఆరు టర్కీ సి-130ఇ హెర్క్యులస్ విమానాలు కరాచీలో దిగాయని ప్రచారం జరిగింది. వీటిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. దీంతో టర్కీ పాకిస్థాన్కు మద్దతు పలుకుతోందని భావన నెలకొంది. అయితే, ఈ ఆరోపణలను టర్కీ ప్రభుత్వం ఘాటుగా ఖండించింది.
టర్కీ అధికారిక సమాచారం ప్రకారం, తమ కార్గో విమానం కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే కరాచీలో ఆగిందని తెలిపారు. పాకిస్థాన్కు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదని స్పష్టంగా ప్రకటించారు. మీడియా కథనాల్లో నిజం లేదని టర్కిష్ అధికారిక వర్గాలు తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాయి.
టర్కీ, పాకిస్థాన్ మధ్య ఉన్న వ్యూహాత్మక బంధం ఇప్పటికే తెలిసిందే. గతంలోనూ కశ్మీర్ అంశంపై పాకిస్థాన్కు మద్దతుగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్ స్పష్టంగా స్పందిస్తూ కశ్మీర్ తమ అంతర్గత విషయం అని, విదేశీ జోక్యం అంగీకరించబోమని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో టర్కీ తన క్లారిటీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.