కేసీఆర్‌ వర్సెస్‌ బండి సంజయ్‌: ‘ఆ పంచాయితీ’ తెగేనా.?

There is a behind-the-scenes 'mystery' between political parties

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల ప్రకియ కొంతవరకే పూర్తయింది. పోలింగ్‌ పూర్తయ్యిందిగానీ, మేయర్‌ ఎన్నిక పూర్తవ్వాల్సి వుంది. దానికి ఇంకా సమయం వుంది. ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తెరవెనుక ‘మంత్రాంగం’ నడుస్తోంది. ఢిల్లీ టూర్‌ విషయంలో పైకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏం చెబుతున్నా, తెరవెనుకాల కథ వేరే వుంది. గ్రేటర్‌ ఎన్నికలు పూర్తవగానే, కొత్త పార్లమెంటు విషయంలో కేసీఆర్‌, మోడీ సర్కార్‌ని అభినందించారు, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళారు. కేసీఆర్‌, ఢిల్లీలో వుండగానే, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడికి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. ఇంతకీ, ఢిల్లీలో ఏం జరిగింది.? ఏం జరుగుతోంది.?

There is a behind-the-scenes 'mystery' between political parties

తూచ్‌.. అదంతా తెలంగాణ అభివృద్ధి కోసమే.!

తెలంగాణ కోసమంటూ ఏం చేసినా చెల్లిపోతుందన్నది టీఆర్‌ఎస్‌ భావన. అందులో కొంత నిజం లేకపోలేదు కూడా. చంద్రబాబుని తిట్టిపోసెయ్యమంటే తిట్టిపోసేశారు.. మళ్ళీ ఆ చంద్రబాబుని ప్రశంసించమంటే ప్రశంసించేశారు. కాంగ్రెస్‌ భజన చేశారు, బీజేపీ భజన కూడా చేశారు.. ఆ రెండు పార్టీల్నీ తిట్టారు.. తెలంగాణ సమాజాన్ని ఎలా కావాలంటే అలా వాడేసుకోవడంలో గులాబీ పార్టీకి వున్న అడ్వాంటేజ్‌ అలాంటిలాంటిది కాదు. రేప్పొద్దున్న బీజేపీ విషయంలో మళ్ళీ పాత నాటకానికి కేసీఆర్‌ తెరలేపినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

కేసీఆర్‌వి జిమ్మిక్కులేనంటున్న బండి సంజయ్‌

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ధీటుగా రాజకీయంగా ఎదుగుతున్నారు. అయితే, బీజేపీ రాజకీయాల్ని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. బీజేపీ, తమ రాజకీయ ప్రయోజనాల విషయంలో ఒక్కోసారి సొంత పార్టీ నేతల స్థాయినీ దిగజార్చేయగలదు. ఆంధ్రప్రదేశ్‌లో కంభంపాటి హరిబాబు తదితరుల పరిస్థితి ఏమయ్యిందో చూశాం. అంతెందుకు, వెంకయ్యనాయుడు విషయంలో బీజేపీ అధిష్టానం ఏం చేసిందో అందరికీ కనిపిస్తూనే వుంది. ఉప రాష్ట్ర పదవిలో కూర్చోబెట్టి, రాజకీయాలు మాట్లాడలేని పరిస్థితుల్లోకి ఆయన్ని నెట్టేశారు. ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తున్నా, బండి సంజయ్‌.. తన స్థాయిని మర్చిపోయి కేసీఆర్‌ని సవాల్‌ చేసేస్తున్నారు. కేసీఆర్‌ పొలిటికల్‌ స్టామినా బండి సంజయ్‌కి తెలియదని ఎలా అనుకోగలం.? తెలిసే, ఆయన అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నది నిర్వివాదాంశం.

మజ్లిస్‌కి అటూ ఇటూ.!

గ్రేటర్‌ మేయర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ స్టడీగా సీట్లు సాధించింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ కలవాలి.. లేదంటే టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ కలవాలి.. అదీ కుదరకపోతే, మజ్లిస్‌, బీజేపీ కలవాలి. ఏ రెండు పార్టీలూ కలవకుండా మేయర్‌ ఎన్నిక జరగదు. మరి, ఎవరు ఎవరితో కలుస్తారు.? ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్ళిన కేసీఆర్‌, ఆ వెంటనే ఢిల్లీ నుంచి పిలుపు అందుకున్న బండి సంజయ్‌.. గ్రేటర్‌ ఎన్నికల గురించి కాక, ఇతరత్రా విషయాలు చర్చించారంటే ఎలా నమ్మేది.?