రాజధాని భూముల కొనుగోలు విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని, ఐపీసీ సెక్షన్లు ఈ కేసులో వర్తించవని హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ “భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చెయ్యకుండా ఎలా కేసులు పెడతారు” అని ప్రశ్నించింది. అలాగే ఆస్తుల క్రయవిక్రయాలు నేరం కాదు అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. దీన్నిబట్టి చూస్తే రాజధానిలో భూములు కొన్నవారు నిందితులు కారనే అర్ధం అవుతుంది. అది ఎలా కొన్నారు అనేది వేరే విషయం.
జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగింది ఏమిటి? “జగన్మోహన్ రెడ్డి తమను మోసం చేశారని, తమనుంచి బలవంతంగా షేర్లు కొనిపించారని, తమ నుంచి పెట్టుబడులు స్వీకరించి తద్వారా తమ కంపెనీలకు లాభాలు చేకూర్చారని” ఏ ఒక్క కంపెనీ గాని, వ్యక్తులు కానీ, జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినవారు కానీ, ఫిర్యాదు చెయ్యలేదు. జగన్ మోహన్ రెడ్డి కంపీనీలు, మరికొందరి కంపెనీల మధ్య జరిగిన వ్యాపారలావాదేవీలు నేరం ఎలా అవుతాయి? వారు ఎవరిని మోసగించారు? మమ్మల్ని మోసం చేశారు అని ఎవరూ కోర్టుకు చెప్పలేదు. అయినప్పటికీ సిబిఐ జగన్ విషయంలో క్విడ్ ప్రో కో కు పాల్పడ్డారని ఆయన మీద కేసులు పెట్టింది.
ఎవరూ ఫిర్యాదు చెయ్యకుండా సిబిఐ జగన్ పై ఎలా కేసులు పెట్టింది? ఎలా నిర్బంధించింది? ఎలా విచారణ చేస్తున్నది? రాజధాని ఒక ప్రాంతంలో వస్తుందని చంద్రబాబు ముందుగానే కొందరికి లీక్ చేశారనే విషయంలో ఎవరికీ సందేహం లేదు. అలాంటి సమాచారం లేకపోతె ఎకరాలకు ఎకరాలు ఎవ్వరూ ఆ ప్రాంతంలో కొనుగోలు చెయ్యరు.
ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జగన్ మీద సిబిఐ పెట్టిన కేసులు కూడా సక్రమంగానే భావించాల్సి ఉంటుంది. ఏవో వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు జరిగితే దానికి జగన్ మోహన్ రెడ్డిని బాధ్యుడుగా చెయ్యడం ఎలా కుదురుతుంది? పైగా అప్పుడు జగన్ అధికారంలో లేరు. ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అమరావతి విషయంలో చంద్రబాబు అధికారంలో ఉన్నారు. చంద్రబాబు కుమారుడు సైతం హెరిటేజ్ కోసం భూములు కొన్నారు. ఇది నేరం కానప్పుడు జగన్ చేసింది నేరం ఎలా అవుతుంది?
ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పేరు సాంకేతికంగా కరెక్ట్ కాకపోవచ్చు. కానీ అక్కడ జరిగింది రహస్య లావాదేవీలే.ఈ లావాదేవీల్లోనే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి కుటుంబం, మాజీ ఏ జి కూడా కొన్ని ఎకరాల భూములు కొన్నారు.ఈ అంశం మీద ప్రభుత్వం మరింత లోతుగా దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉన్నది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు