క్రికెట్ అభిమానుల కోసం ఒక సరికొత్త సంచలనం రానుంది. టెస్ట్ మ్యాచ్ల సీరియస్ వ్యూహాత్మకతను, టీ20 ఉత్కంఠభరిత వేగాన్ని ఒకే వేదికపై అందించే “టెస్ట్ -20” ఫార్మాట్ను త్వరలో ప్రారంభించబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ వినూత్న ఫార్మాట్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరో కొత్త అధ్యాయంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ కొత్త రూపంలో ప్రతి జట్టు ఒకే రోజున రెండు ఇన్నింగ్స్లు ఆడుతుంది. ఒక్కో ఇన్నింగ్స్ 20 ఓవర్లుగా ఉండటంతో మ్యాచ్ మొత్తం 80 ఓవర్లలో ముగుస్తుంది. టెస్ట్ మ్యాచ్లా పిచ్ పరిస్థితులను అంచనా వేస్తూ వ్యూహాత్మకంగా ఆడే అవకాశం ఉంటే, మరోవైపు టీ20 తరహాలో వేగవంతమైన ఆట అభిమానులను స్క్రీన్లకు అతుక్కుపోయేలా చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఫార్మాట్ రూపకల్పన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం యువతరాన్ని ఆకర్షించడం. ముఖ్యంగా 13 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల క్రికెట్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్ను రూపొందించారు. దీని వల్ల టెస్ట్ క్రికెట్పై యువత ఆసక్తి పెరగడమే కాకుండా, క్రికెట్లో కొత్త తరానికి వ్యూహాత్మక ఆలోచన, వేగవంతమైన స్పందన కలిపి నేర్పించే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఈ టోర్నమెంట్ను ఛాంపియన్షిప్ తరహాలో నిర్వహించాలని నిర్వాహకుడు గౌరవ్ బహిర్వాణీ వెల్లడించారు. తొలి రెండు ఎడిషన్లు భారత్లోనే జరగనున్నాయి. మొదటి ఎడిషన్ 2026 జనవరిలో ప్రారంభమవుతుందని సమాచారం. ఆ తర్వాత ఈ ఫార్మాట్ను అంతర్జాతీయంగా విస్తరించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. లీగ్గా అభివృద్ధి చేసి ప్రపంచంలోని పలు దేశాల్లో మ్యాచ్లు నిర్వహించాలనే లక్ష్యంతో నిర్వాహకులు ముందుకు వెళ్తున్నారు.
ఈ ఫార్మాట్ను ఆవిష్కరించిన వారిలో ప్రముఖ క్రికెటర్లు Matthew Hayden, Harbhajan Singh, Clive Lloyd, AB de Villiers ఉన్నారు. వీరి ప్రకారం, టెస్ట్ మరియు టీ20 ఫార్మాట్ల కలయికగా రూపుదిద్దుకున్న టెస్ట్ -20 ఆటగాళ్లను సరికొత్తగా ఆలోచించేలా, జట్లను కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేలా చేస్తుంది. వ్యూహం, స్పీడ్, ఉత్కంఠ ఈ మూడు అంశాలు కలిపి అభిమానులకు మరపురాని అనుభవాన్ని ఇవ్వబోతున్నాయి.
ఈ లీగ్లో పాల్గొనడానికి పలు దేశాల బోర్డులు ఇప్పటికే ఆసక్తి చూపుతున్నాయని నిర్వాహక వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా ఫ్రాంచైజీ మోడల్లో కూడా ఈ లీగ్ను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. స్టార్ ఆటగాళ్లు, లెజెండ్స్, యంగ్ టాలెంట్స్ అన్నీ ఒకే వేదికపై ఆడబోతుండటంతో ఇది అభిమానులకు క్రికెట్ ఉత్సవంగా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఒకవైపు సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ విలువను నిలుపుతూ, మరోవైపు వేగవంతమైన ఫార్మాట్తో గ్లోబల్ ఆడియన్స్ను ఆకర్షించడమే ఈ ప్రయత్నం లక్ష్యం. క్రికెట్లో ఇప్పటివరకు లేని ఈ హైబ్రిడ్ ఫార్మాట్ ఆటలో కొత్త పుంతలు తొక్కబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
