తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ… ఈసీ లేటెస్ట్ అప్ డేట్ ఇదే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పురుడుపోసుకుంటోంది. కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన తీన్మార్ మల్లన్న పార్టీ పేరును రిజిస్టర్ చేసే ప్రక్రియను ఎన్నికల కమిషన్ తాజాగా ప్రారంభించింది. ఇదే క్రమంలో పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా ప్రజలను కోరింది.

దీంతో ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఇది కీలక పరిణామం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 114 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్… తెలంగాణ రాజకీయాన్ని హీటెక్కించిన నేపథ్యంలో… డిక్లరేషన్స్ పేరుతో కాంగ్రెస్ జోరు పెంచింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణాదిలో దారులు మూసుకుపోతున్నాయన్న కామెంట్లు సంపాదించుకున్న బీజేపీ కూడా తన మార్కు రాజకీయం చేస్తుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణలో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటనపై కీలక అప్ డేట్ రావడం కచ్చితంగా ఆసక్తికరమైన విషయమే అని అంటున్నారు పరిశీలకులు. ఈ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో అన్ని చోట్లా కకపోయినా కొన్ని చోట్లయినా కీలక ప్రభావం చూపించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

కాగా… ఈ ఏడాది ఏప్రిల్‌ లో కొత్త పార్టీకి సంబంధించి తీన్మార్ మల్లన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ పేరును “తెలంగాణ నిర్మాణ పార్టీ” గా ఆనాడే ప్రకటించారు. అనంతరం రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోగా… తాజాగా పార్టీ పేరు రిజిస్టర్ చేసే ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

పార్టీ పేరుపై ఎవరికైనా, ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాల్సిందిగా ఎన్నికల కమిషన్ ప్రజలను కోరింది. ఈ మేరకు ఈసీ వెబ్‌ సైట్‌ లో ఒక ప్రకటన జారీ చేసింది. ఈ నెల 20వ వరకూ ప్రజల అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపింది. ఈ సమయంలో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ… “తెలంగాణ నిర్మాణ పార్టీ” ప్రధాన కార్యదర్శిగా మాదం రజనీ కుమార్, కోశాధికారిగా ఆర్.భావనను ఎన్నికల కమిషన్ గుర్తించింది.

అయితే ప్రక్రియ అంతా అనుకూలంగా జరిగిపోతే… తన సొంతపార్టీ నుంచి మల్లాన్న్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే… గతంలో కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా తాను పోటీ చేయబోయే స్థానంపై మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో తాను మేడ్చల్ నియోజకవర్గం నుంచి మంత్రి మల్లారెడ్డిపై పోటీ చేయనున్నట్లు ప్రకటించారు

దీంతో తన పార్టీ నుంచి ఈసారి నిజంగానే మల్లన్న మేడ్చల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారా.. లేక, మరో స్థానాన్ని ఎంచుకుంటారా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇదే క్రమంలో… రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లోను పోటీ చేస్తుందా.. లేక, కొన్ని నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను నిలబెడుతుందా అనేది కూడా ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా… ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అనే చెప్పాలి!