మల్లారెడ్డి సక్సెస్ సీక్రెట్ జయలలిత… సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. గతకొంతకాలంగా మల్లారెడ్డి మాటల వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పై మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అవును… పూలమ్మినా.. పాలమ్మినా.. అంటూ మంత్రి మల్లారెడ్డి చెప్పిన మాటలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసరిగా మల్లారెడ్డి సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ అయిపోయారు. అయితే… పాలమ్మి, పూలమ్మి మంత్రి మల్లారెడ్డి ధనవంతుడు కాలేదని.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత డబ్బులు దొంగిలించి, ఆస్తులు కాజేసి పైకొచ్చాడని కామెంట్స్ చేశారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి… మంత్రి మల్లారెడ్డి పై ఈ స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో తమిళనాడు దివంగత సీఎం జయలలితకు నగర శివారులోని కొంపల్లిలో 11 ఎకరాల స్థలం ఉండేదని, అందులో డైరీ ఫాం ఉండేదని చెప్పుకొచ్చిన సుధీర్ రెడ్డి.. ఆ సమయంలో పాల వ్యాపారం చేయడానికి అక్కడికి వెళ్లిన మంత్రి మల్లారెడ్డి ఆమె డబ్బులు కాజేశారని అన్నారు.

ఆ సమయంలో… ఐటీ దాడులు జరుగుతున్నట్లు జయలలితకు సమాచారం ఉండడంతో తన వద్ద ఉన్న డబ్బు, నగలు ఒకచోట దాచిపెట్టారని.. వాటిని మల్లారెడ్డి దొంగిలించాడని.. ఆ విధంగా మల్లారెడ్డి ధనవంతుడు అయ్యాడని సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తన ఇంటి పక్కనే ఉండే క్రిస్టియన్ విద్యాసంస్థల యజమానురాలిని మోసం చేసి, ఆమెకు తెలియకుండా సంతకాలు పెట్టించుకుని, ఆమె మరణం తర్వాత ఆ ఆస్తిని కాజేశారని ఆరోపించారు.

వీటితోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఇలా చెప్పుకుంటూపోతే మంత్రి మల్లారెడ్డి చెయ్యని అవినీతి లేదంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో… మంత్రి మల్లారెడ్డి, ఆయన బావమరిది గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిలో ఉండి చేసిందేమీ లేదని, తమ వ్యాపారాల కోసం నియోజకవర్గాన్ని నాశనం చేశారని సుధీర్ రెడ్డి మండిపడ్డారు. దీంతో… ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి!