Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటుచేసుకోబోతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత పార్టీ స్థాపన దిశగా వడివడిగ అడుగులు వేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లో విలేకరులతో జరిగిన ఇష్టాగోష్టిలో ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టతనిచ్చారు. పాత పేరు, కొత్త అజెండాతో ప్రజల్లోకి రాబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
భారత్ రాష్ట్ర సమితి (BRS) ప్రస్తుతం నిద్రావస్థలో ఉందన్న కవిత, గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరు ఖాళీగా ఉందని, దానిని ఎవరైనా వాడుకోవచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తుందని, ఇతర రాష్ట్రాల వ్యూహకర్తల అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.
లక్ష్యం: అధికార కాంగ్రెస్ పార్టీనే తమ ప్రధాన శత్రువు అని, వారి వైఫల్యాలను ఎండగట్టడమే తమ అజెండా అని పేర్కొన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక బృందం పనిచేస్తోందని, ఆవిర్భావం రోజున అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి ప్రస్థానం ప్రారంభిస్తామని తెలిపారు.

రాష్ట్ర రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్ రావులపై కవిత సెటైర్లు వేశారు. “గుంపు మేస్త్రీ, గుంట నక్కలు దోస్తులు” అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి చెప్తున్న ఫ్యూచర్ సిటీపై స్పందిస్తూ.. “ముందున్న సిటీని చంపకుండా ఉంటే చాలు” అని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో ప్రచారం చేసి అక్కడి కాంగ్రెస్ను ఓడించిన రేవంత్, ఇప్పుడు కేరళ వెళ్తున్నారని.. అక్కడ కూడా అదే ఫలితం వస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నియోజకవర్గాల కేటాయింపుపై మాట్లాడుతూ.. ఒకవేళ సిద్దిపేట అసెంబ్లీ స్థానం మహిళలకు రిజర్వ్ అయితే, అక్కడి నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. అలాగే గజ్వేల్ రిజర్వేషన్ అంశంపై కూడా సానుకూలంగా ఆలోచిస్తానని తెలిపారు.
ఈ పరిణామాలతో తెలంగాణలో త్వరలోనే ‘తెలంగాణ ప్రజా జాగృతి’ లేదా పాత ‘టీఆర్ఎస్’ పేరుతో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం రాబోతుందనే చర్చ జోరందుకుంది.

