న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని హతమారుస్తూ మొన్న సెప్టెంబర్ పదిహేనో తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్ పై స్టే ఇస్తూ సుప్రీమ్ కోర్ట్ ఈరోజు ఇచ్చిన ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అతి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టినట్లు హైకోర్టు చేస్తున్న వ్యాఖ్యలు, స్టేలు లాంటి అవాంతరాలనుంచి పెద్ద ఉపశమనంగా భావించాలి. అలాగే న్యాయానికి దక్కిన విజయం ఈ ఉత్తర్వులు.
అరే! తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు పాలనలో కొందరు ఘరానా పెద్దలు, రాజధాని భూములని దోచుకున్నారని సాక్షాత్తూ ప్రభుత్వమే ఆరోపిస్తూ కేసులు పెడితే, ఆ కేసులో నిజానిజాలేమిటో అసలు విచారించకుండానే కొట్టేయడం, విచారణ జరగకూడదని శాసించడమే కాక, అసలు ఆ విషయాలు పత్రికల్లో ప్రచురించరాదని , టీవీల్లో రాకూడదని నియంతృత్వ ఆదేశాలను వెలువరించి హైకోర్టు న్యాయాన్ని పట్టపగలే దారుణంగా హత్య చేసింది. ఈ భూదోపిడీలో సుప్రీమ్ కోర్ట్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రమణ కుమార్తెలు ఉండటమే హై కోర్ట్ అన్యాయపు ఆదేశాలకు కారణం. పైగా కోర్టుకు వెళ్ళింది ఒక్క దమ్మాలపాటి శ్రీనివాస్ మాత్రమే. కానీ, ఆ కేసులోని పదమూడు మంది నిందితులకు వర్తించే విధంగా హై కోర్ట్ ఆదేశాలు ఇవ్వడం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చట్టం ముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రి కూడా సమానులైన ఈ దేశంలో ఒక సీనియర్ న్యాయమూర్తి కుమార్తెలు ఏ విధంగా మినహాయింపును పొందుతారు? అసలు దర్యాప్తు చెయ్యొద్దని ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి హైకోర్టుకు ఏమి అధికారం ఉన్నది? ప్రభుత్వం ఉన్నది దేనికి? ఈ అన్యాయపు ఉత్తర్వులు జగన్మోహన్ రెడ్డి సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడానికి ప్రేరేపించాయి. మేధావులు, సీనియర్ పాత్రికేయులు, పత్రికలూ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచాయి.
హైకోర్టు గాగ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎపి ప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ విచారణ ఈరోజు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్నాసనం హైకోర్టు ఇచ్చిన గాగ్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడమే కాకుండా జనవరి నెలాఖరు వరకు ఈ కేసు మీద ఎలాంటి తుది ఉత్తర్వులు ఇవ్వరాదని ఆదేశించింది. ఇది హైకోర్టుకు అతి పెద్ద షాక్ గా భావించవచ్చు. డిజిపిని, చీఫ్ సెక్రెటరీని నిలబెట్టి ఇష్టం వచ్చినట్లు వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీమ్ కోర్ట్ ఈరోజు ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలిస్తే ఇప్పుడు ఏపీలో న్యాయవ్యవస్థ సరిగ్గా పని చేస్తున్నట్లా లేనట్లా అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. రాజ్యాంగ పాలన ఉన్నదో లేదో తేలుస్తాం అంటూ పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న హైకోర్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో న్యాయబద్ధమైన విచారణలు జరుగుతున్నాయా లేదా అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోవాల్సివస్తున్నది.
ముఖ్యంగా సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లేఖపై సుప్రీమ్ కోర్ట్ సానుకూల స్పందనగా ఈనాటి సుప్రీంకోర్టు ఉత్తర్వులను భావించవచ్చు. చంద్రబాబు, ఆయన ముఠా ఐదేళ్లలో చేసిన దోపిడీని, రాజధాని పేరుతో రైతులనుంచి కారుచౌకగా దోచుకున్న సంపదను అక్రమార్కులనుంచి తిరిగి రాబట్టడమే కాక గజదొంగలను శిక్షింపజేయాలి. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఈ ఉత్తర్వులు గట్టి దెబ్బ అని చెప్పుకోవచ్చు.
అవినీతిపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అతి సాహసవంతమైన పోరాటానికి అన్ని వ్యవ్యస్థలు సహకరించాలి. ముఖ్యంగా న్యాయవ్యవస్థ ప్రభుత్వానికి సహకరించాలి. లేకపోతె అవి ప్రజావిశ్వాసాన్ని పోగొట్టుకుంటాయి.