కరోనా తర్వాత మరొక వైరస్ మానవాళిపై ప్రమాద ఘడియలను మోగిస్తున్నదనే భయాలు మొదలయ్యాయి. గబ్బిలాల్లో తాజాగా గుర్తించిన హెచ్కేయూ5 అనే వైరస్పై శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) వర్గానికి చెందినదిగా గుర్తించారు. ఒక చిన్న జన్యుపరమైన మార్పుతో ఇది మానవ కణాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందన్నది తాజా పరిశోధనల ద్వారా వెలుగులోకి వచ్చింది.
వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నేతృత్వంలో జరుగుతున్న ఈ అధ్యయనానికి, అమెరికాలోని ప్రముఖ సంస్థలు మద్దతు ఇచ్చాయి. హెచ్కేయూ5 వైరస్, మన శరీరంలో ఉన్న ఏసీఈ2 అనే రిసెప్టర్ను టార్గెట్ చేయగలదని పరిశోధకులు తెలిపారు. ఇది సరిగ్గా కోవిడ్ వైరస్ లాగే వ్యవహరిస్తుండటమే శాస్త్రవేత్తల్ని ఆందోళనకు గురిచేస్తోంది.
ఇప్పటికే ఈ వైరస్ మింక్స్ అనే జంతువుల్లో కనుగొనడం, మానవుల్లోకి విస్తరించే ముప్పుకు సంకేతంగా భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఆల్ఫాఫోల్డ్ 3 అనే ఏఐ టూల్ ద్వారా వైరస్ ప్రోటీన్లు శరీర గ్రాహకాలపై చూపించే ప్రభావాన్ని విశ్లేషిస్తున్నారు. ఇది మహమ్మారి బారిన పడే అవకాశాలపై ముందస్తు హెచ్చరికలు ఇచ్చేందుకు ఉపయోగపడనుంది.
ప్రస్తుతం హెచ్కేయూ5 నిశ్శబ్దంగా ఉన్నా… ఏదైనా మార్పుతో అది కోవిడ్ తరహాలో విజృంభించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థలు, పరిశోధనా సంస్థలు ఈ వైరస్పై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు, నిరంతర నిఘా అనేవే దీన్ని అడ్డుకునే మార్గం.