ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీ నేతలు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. అవును… అధికారిక ఆస్తుల్లో దేశంలోని ముఖ్యమంత్రుల్లో కెళ్లా అత్యంత ఆస్తిపరుడుగా నిలుస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మొత్తం రూ.510 కోట్ల ఆస్తులతో సీఎం జగన్ దేశంలోనే ధనికుడైన సీఎంగా రికార్డు సృష్టించారు. ఇక దేశంలోని మూడో రిచ్చెస్ట్ ఎమ్మెల్యెగా నారా చంద్రబాబు నాయుడు రికార్డ్ సృష్టించారు!
తాజాగా ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. అలాగే దేశంలో మిగతా 29 మంది ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపినా జగన్ కంటే తక్కువేనని ఈ సంస్థలు వెల్లడించాయి. జగన్ తర్వాత రెండో స్థానంలో అరుణ్ చల్ ప్రదేశ్ సీఎం ప్రేమ ఖండూ నిలిచారు. ఆయన అధికారిక ఆస్తులు సుమారు 163 కోట్ల రూపాయలు. ఇక రిచెస్ట్ సీఎంల జాబితాలో మూడో స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలవగా.. ఆయన ఆస్తులు అధికారికంగా సుమారు 63 కోట్ల రూపాయలు అని ఏడీఆర్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి కూడా ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు సంచలన విషయాన్ని బయటపెట్టాయని తెలుస్తుంది. అయితే ఈ విషయాలను హైలైట్ చేయడంలో ఒక వర్గం మీడియా సక్సెస్ అయ్యిందనేది వైకాపా నేతల మాట! ఈ నివేదికలో… దేశంలోనే చంద్రబాబు అత్యంత ధనికుడైన మూడో ఎమ్మెల్యే అని ఏడీఆర్ వెల్లడించిందని సాక్షి మీడియా తన కథనంలో పేర్కొంది.
దేశంలో ధనిక ఎమ్మెల్యేల జాబితాలో మొదటి స్థానంలో ఎన్.నాగరాజు ఉన్నారు. ఈయనకు రూ.1015 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక రూ.840 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉన్నారు. ఇక మూడో స్థానంలో నిలిచిన చంద్రబాబుకు రూ.668 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నాలుగో స్థానంలో జయంతి భాయ్ పటేల్ నిలిచారు. ఈయనకు రూ.661 కోట్ల ఆస్తులున్నాయి.