వరుస ట్వీట్లతో వాయిస్తున్న ప్రకాశ్ రాజ్… టార్గెట్ క్లియర్!

ఇండియా పేరును భారత్ గా మారుస్తున్నారా అనే చర్చ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. జి-20 దేశాల సదస్సు నేపథ్యంలో ఇది దేశం ఆవల కూడా చర్చనీయాంశం అయ్యింది. ఇపప్టికే చైనా లాంటి దేశాలు సైతం ఈ విషయంపై స్పందిస్తూ ఇండియాను ఎద్దేవా చేస్తున్నాయి. ఈ సమయంలో నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు.

విపక్ష కూటమి తనపేరును ఇండియా గా మార్చుకున్న నేపథ్యంలో మోడీ ఈ విషయంపై సీరియస్ గా ఉన్నారనే కామెంట్లూ వినిపిస్తున్న నేపథ్యమంలో… ఈ విషయాన్ని కొంతమంది స్వాగతిస్తుండగా.. చాలా మంది వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. పైగా… జీ 20 సదస్సుకు రాబోతున్న ప్రపంచ దేశాల అధినేతలకు అందించిన ఆహ్వానపత్రికలతో ఈ విషయంపై ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేసిందని అంటున్నారు.

ఇందులో భాగంగా జీ20 సదస్సుకు వస్తున్న దేశాధినేతలకు అందించిన ఆహ్వానపత్రికల్లో… “ప్రెసిడెంట్ ఆఫ్ భారత్” అని ద్రౌపది ముర్ము, “ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్” అని మోడీ ల పేరున ఆహ్వానాలు ముద్రించారు. ఈ సమయంలో తాజాగా ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. జాతీయ జెండా రంగును కూడా మారుస్తారేమో అంటూ ఒక పోస్ట్ పెట్టి, అందులో బీజేపీ జెండా రంగు ఫోటోను షేర్ చేశారు.

ఇండియా – భారత్ పేరు మార్పులపై జరుగుతున్న చర్చపై తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. “మీరు తలచుకుంటే భయంతో పేర్లను మాత్రమే మార్చగలరు… కానీ, ఇండియన్స్ అయిన మేము తలచుకుంటే సగర్వంగా మీ ప్రభుత్వాన్నే మారుస్తాము” అని ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా టీం ఇండియా క్రికెటర్ జెర్సీపై ఇండియా పేరును క్రాస్ చేసి, భారత్ అని రాస్తున్నట్లుగా ఉన్న సతీష్ ఆచార్య కార్టూన్ ను షేర్ చేశారు. అనంతరం బీజేపీ ఫ్లాగ్ కలర్ లో ఉండే ఒక ఫోటోను పోస్ట్ చేసిన ప్రకాశ్ రాజ్… “మన జాతీయ జెండా రంగులు మార్చి తమ నిజమైన రంగును వెల్లడిస్తారా?” అని కామెంట్ పెట్టారు.

ఇదే సమయంలో “తన ఎన్నికల డ్రామా కోసం బట్టలు మార్చుకుని తన దేశం పేరును కూడా మార్చుకోవడానికి ప్రయత్నించే విదూషకుడి పేరు చెప్పండి” అంటూ మరో ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. ఇలా వరుసగా ప్రకాశ్ రాజ్ చేస్తున్న ట్వీట్లు ఎవరిని ఉద్దేశించినవి అనేది తెలిసిన విషయమే కావడంతో… తెగ వైరల్ అవుతున్నాయి!