రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, తెలంగాణలోలానే, ఆంధ్రపదేశ్లో కూడా మూడో స్థానానికో, నాలుగో స్థానానికో పరిమితమయ్యేలా కనిపిస్తోంది. వైసీపీ తాజా అంచనాల ప్రకారం, 2024 ఎన్నికల నాటికి జనసేన పార్టీనే వైసీపీకి బలమైన ప్రత్యర్థి కాబోతోందట. ఈ విషయమై వైసీపీ ముఖ్య నేతలు ఖచ్చితమైన అవగాహనతో వున్నారనే ప్రచారం జరుగుతోంది. అదేంటీ, 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకుని, దాన్ని సైతం నిలబెట్టుకోలేకపోయిన జనసేన, 2024 నాటికి బలోపేతమయ్యే అవకాశాలు వున్నాయా.? పైగా, బీజేపీతో అంటకాగుతూ, చాలా విషయాల్లో ఎలాంటి రాజకీయ స్పష్టతా లేకుండా స్తబ్దుగా వ్యవహారాలు నడుపుతున్న జనసేన పార్టీకి అంత సీన్ వుందా.? అన్న అనుమానాలు కలగడం సహజమే. కానీ, గ్రౌండ్ లెవల్లో పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి.
బీజేపీ హంగామా ఎంత ఎక్కువగా కనిపిస్తున్నా, ఆ పార్టీ రెండో స్థానానికి రావడం అసాధ్యమేనన్నది తాజా అంచనాల సారాంశం. తెలుగుదేశం పార్టీ పైకి ఎంత హంగామా చేస్తున్నా, చాలా వేగంగా క్యాడర్ని కింది స్థాయిలో కోల్పోతోందట. జనసేన ప్రభావం పైకి ఏమీ కనిపించకపోయినా, కింది స్థాయిలో మాత్రం బలం బాగానే పుంజుకుంటుందని రాజకీయ విశ్లేషకులూ చెబుతున్నారు. అయితే, త్వరలో జరిగే స్థానిక ఎన్నికలతో మాత్రమే జనసేన అసలు బలం ఏంటన్నదానిపై ఓ అవగాహన వస్తుంది.
దానికి తోడు, బీజేపీతో బంధం తెంచుకుని, జనసేన ఒంటరిగా ముందడుగు వేస్తే మాత్రం, వైసీపీకి బలమైన పోటీదారుగా గ్లాసు పార్టీ నిలిచే అవకాశం వుంటుంది. వీటన్నటికీ తోడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే, రాజకీయ కార్యకలాపాలపై ఇంకాస్త ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వుంటుంది. వారంలో రెండు రోజులైనా ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల కోసం.. అదీ పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తే, జనసేన పార్టీకి అది చాలా పెద్ద ప్లస్ కాబోతోందట. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ, ఉత్తరాంధ్రలోనూ జనసేన పార్టీ ఇటీవలి కాలంలో బాగా పుంజుకుంటోందని సమాచారం.