జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి పాక్ ప్రేరణ ఉందన్న ఆరోపణల నేపథ్యంలో భారత్ ప్రభుత్వమైతే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దు చేసిన కేంద్రం, మెడికల్ వీసా ఉన్నవారు కూడా ఈ నెల 29లోపు దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. అంతేగాక, సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ పాక్పై దౌత్యపరంగా తీవ్ర దెబ్బ కొట్టింది.
ఈ చర్యలు కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్(KSE 100)పై భారీ ప్రభావం చూపించాయి. గురువారం ట్రేడింగ్లో పాక్ మార్కెట్ దాదాపు 2 శాతం నష్టపోయింది. ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు ఇది మరో ఎదురుదెబ్బగా నిలిచింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(IMF) కూడా పాకిస్తాన్ వృద్ధి అంచనాలను 3 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గించింది. దీంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది.
ఇక భారత్ తీసుకున్న కఠిన చర్యల్లో భాగంగా పాక్ మిలిటరీ అటాషెలను బహిష్కరించింది. దౌత్య సిబ్బందిని గణనీయంగా తగ్గించనుంది. సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని నిలిపివేసింది. పాక్తో ఉన్న అట్టారీ సరిహద్దును కూడా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పాక్ కూడా తమ షహీన్-III లేదా బాబర్ క్షిపణులను పరీక్షించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో భారత్ కూడా INS సూరత్ నుంచి కొత్త గైడెడ్ మిస్సైల్ను పరీక్షించింది. ఈ పరిణామాలన్నీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తీవ్రంగా పెంచుతున్నాయి.