ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విభిన్నమైన మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా సమగ్ర సమయ పాలనకు కేంద్రం వన్ నేషన్… వన్ టైమ్ అనే ఆలోచనను తీసుకొచ్చింది. ఈ పద్ధతిలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఒకే ఐఎస్టీ (ఇండియన్ స్టాండర్డ్ టైమ్)ను అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ కొత్త విధానానికి సంబంధించిన ముసాయిదాను ఇటీవల కేంద్రం ప్రజల ముందు ఉంచింది. దేశవ్యాప్తంగా అన్ని కార్యకలాపాల్లో ఒకే సమయాన్ని అమలు చేయాలని, ప్రత్యేకించి వాణిజ్య, రవాణా, పరిపాలన, ఆర్థిక కార్యకలాపాల్లో ఏకరీతి విధానాన్ని తీసుకురావాలని ఈ ప్రణాళికలో ప్రస్తావించారు. ఐఎస్టీ ఆధారంగా వ్యవహరించడం వల్ల ప్రాంతీయ సమయాల్లో తలెత్తే అనేక అవాంతరాలు తొలగిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నూతన విధానంపై దేశ ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు కేంద్రం వచ్చే నెల 14 వరకు గడువు ప్రకటించింది.
ప్రజల సూచనలు, సలహాల ఆధారంగా ముసాయిదాలో అవసరమైన మార్పులు చేర్పులు చేయాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల దేశవ్యాప్తంగా సమన్వయంతో కూడిన పరిపాలన సాధ్యమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మొత్తం దేశం ఒకే సమయాన్ని అనుసరించడం వల్ల ప్రాంతీయ సమయ భేదాలు, వాణిజ్య వ్యవస్థలో తలెత్తే కష్టాలు, రవాణా సమస్యలు తగ్గుతాయని కేంద్రం అభిప్రాయపడుతోంది. ఉదాహరణకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే సమయాన్ని ఉపయోగించడం ద్వారా పరిపాలనా తీరులో నిర్దిష్టత ఉంటుంది.
ఇప్పటివరకు ప్రతిపాదనపై కొన్ని పాజిటివ్ అభిప్రాయాలు వెలువడుతున్నప్పటికీ, ఈ మార్పుల వల్ల ప్రాంతీయ ప్రభావాలు, స్థానిక అవసరాలపై ఎలా ప్రభావం చూపుతాయనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను చూస్తే, వన్ నేషన్… వన్ టైమ్ ప్రణాళిక దేశ పాలనలో కొత్త అధ్యాయానికి నాంది కావచ్చని చెప్పవచ్చు.