Private Travels: అద్దం లేదు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్తా! ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ వింత సమాధానం

Private Travels: రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను వణికిస్తున్నా, ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల తీరులో మార్పు రావడం లేదు. నిబంధనలను గాలికొదిలేసి, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మరో ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలుగుచూసింది. కనీసం ముందు వైపు అద్దం కూడా లేని బస్సును బెంగళూరుకు నడిపేందుకు సిద్ధమవ్వడం కలకలం రేపింది.

అసలేం జరిగిందంటే?
మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్లేందుకు శ్రీ లక్ష్మీనరసింహ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఆదివారం రాత్రి 9:45 గంటలకు సిద్ధమైంది. పట్టణంలోని కోర్టు సెంటర్ వద్దకు చేరుకున్న 36 మంది ప్రయాణికులు బస్సును చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ బస్సుకు ముందు వైపు ఉండాల్సిన విండ్‌షీల్డ్ (అద్దం) పూర్తిగా లేదు. దీనిపై ప్రయాణికులు డ్రైవర్‌ను నిలదీయగా.. ఆయన ఇచ్చిన సమాధానం మరింత విస్మయానికి గురిచేసింది. “అద్దం లేకపోతే ఏమైంది? నేను హెల్మెట్ పెట్టుకుని బస్సు నడుపుతా” అంటూ ప్రయాణికులపై వెటకారంగా మండిపడ్డాడు. అంతేకాకుండా బస్సు స్టార్ట్ చేయగానే ఇంజిన్ నుంచి భారీగా శబ్దం రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

పోలీసుల రంగప్రవేశం: డ్రైవర్ నిర్లక్ష్యపు సమాధానం, బస్సు దుస్థితిని గమనించిన ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ప్రయాణికులందరికీ టికెట్ డబ్బులు వెనక్కి ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. అత్యవసరంగా వెళ్లాల్సిన ఆరుగురు ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేసి పంపించారు. నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు చేసి, రవాణా శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సీజ్ చేసిన బస్సు రోడ్డుపైకి ఎలా వచ్చింది?
ఈ బస్సుకు రెండు రోజుల క్రితమే ప్రమాదం జరగడంతో అధికారులు దీన్ని సీజ్ చేసినట్లు సమాచారం. అయినప్పటికీ, ఫిట్‌నెస్ లేని బస్సును రాత్రివేళ దొంగచాటుగా ప్రయాణికులతో బెంగళూరుకు పంపేందుకు యాజమాన్యం ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

“ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. ఫిట్‌నెస్ లేని వాహనాలను రోడ్లపైకి తెస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటే సహించేది లేదు.” – మార్కాపురం పోలీసులు హెచ్చరిక

ఇటీవలే మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 14 మంది సజీవదహనమైన ఘటన మరవకముందే, ఇలాంటి బాధ్యతారహితమైన ఘటనలు వెలుగుచూడటంపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tirupati 1993 Plane Crash: Chiranjeevi And Balakrishna | Telugu Rajyam