IPS Sunil Kumar: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పక్షం, అధికారుల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (RRR) లక్ష్యంగా సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత విమర్శలతో కూడిన సునీల్ కుమార్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
రఘురామకృష్ణరాజు ఇటీవల సునీల్ కుమార్ వస్త్రధారణ, వ్యక్తిత్వంపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఐపీఎస్ అధికారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “గేదెలా పెరిగావ్.. నీకు కనీసం సంస్కారం లేదా? మీ అమ్మానాన్నలు నీకు ఏమీ నేర్పించలేదా?” అంటూ సునీల్ కుమార్ మండిపడ్డారు.
“నేను వేసుకున్న కోటు గురించి మాట్లాడటానికి నువ్వెవరు? నీ సొమ్ముతో ఏమైనా కొనిచ్చావా? ‘వాడు, వీడు’ అని పిలవడానికి నీకు ఎంత ధైర్యం? గోదావరి జిల్లాల్లో పనివాళ్లను కూడా ‘బాబు’ అని పిలిచే సంస్కారం ఉంటుంది, అది నీకు లేకపోయింది” అని నిలదీశారు.

కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితం కాకుండా, రఘురామ ఆర్థిక లావాదేవీలపై కూడా సునీల్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
“నువ్వు పొద్దున లేస్తే బ్యాంకులను మోసం చేస్తే గానీ బతకలేవు. నీ బతుకేంటి? నీ చుట్టూ ఎంగిలి మెతుకులు తినే కుక్కలను తయారు చేసుకున్నావు. నీకు మద్దతిచ్చే ఆ రెండు ఛానళ్లను ఎవరూ పట్టించుకోరు.”- ఐపీఎస్ పి.వి. సునీల్ కుమార్
హద్దులు దాటి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోనని సునీల్ కుమార్ హెచ్చరించారు. “ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు.. లేదంటే నేను కూడా తిట్టాల్సి ఉంటుంది. మాట్లాడటం మాకూ వచ్చు” అంటూ ఘాటుగా హెచ్చరించారు.
గతంలో రఘురామకృష్ణరాజు కస్టడీ హింస కేసులో సునీల్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిపై, ఒక సీనియర్ పోలీస్ అధికారి ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.

