Parliament News: వైసీపీని వదలని ’11’ గండం: పార్లమెంట్‌లో రూమ్ నెంబర్ చూసి బెంబేలెత్తిన ఎంపీలు!

Parliament News: కొన్ని అంకెలు కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడితే.. మరికొందరికి అరిష్టంగా మారుతుంటాయి. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన వైసీపీని, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆ ’11’ నెంబర్ వెంటాడుతోంది. పార్లమెంట్ భవనంలో తమకు కేటాయించిన రూమ్ నెంబర్ చూసి ఆ పార్టీ ఎంపీలు షాక్‌కు గురవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగింది?
పార్లమెంట్ పాత భవనం నుంచి పార్టీ కార్యాలయాలను కొత్త భవనానికి మారుస్తున్న క్రమంలో, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వివిధ పార్టీలకు గదులను కేటాయించారు. ఇందులో భాగంగా వైసీపీకి మొదటి అంతస్తులోని ‘రూమ్ నెంబర్ 11’ ను కేటాయించారు. అయితే, ఆ నెంబర్ బోర్డు చూడగానే వైసీపీ ఎంపీలకు ఒక్కసారిగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కళ్లముందు కదలాడాయి. కేవలం 11 సీట్లతో చాపచుట్టేసిన చేదు జ్ఞాపకం గుర్తొచ్చి, ఆ రూమ్ తమకు అరిష్టమని ఎంపీలు గగ్గోలు పెట్టారు.

టీడీపికేమో 9.. మాకేమో 11?
వైసీపీ ఎంపీల అసహనానికి మరో కారణం కూడా ఉంది. అదే ఫ్లోర్‌లో తెలుగుదేశం పార్టీకి 9వ నెంబర్ గదిని కేటాయించారు. అటు ఏపీలో ఘనవిజయం సాధించి, ఇటు ఢిల్లీలో లక్కీ నెంబర్ (9) దక్కించుకున్న టీడీపీని చూసి వైసీపీ నేతలు లోలోపల మదనపడ్డారు. “మాకు 11వ నెంబర్ వద్దు.. అది మాకు అరిష్టం.. వెంటనే మార్చండి” అంటూ స్పీకర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఎంపీల విన్నపాన్ని మన్నించిన స్పీకర్, ఎట్టకేలకు ఆ గదిని రద్దు చేసి, పక్కనే ఉన్న 12వ నెంబర్ గదిని కేటాయించడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో ట్రోలర్లు పండగ చేసుకుంటున్నారు. నెటిజన్లు రకరకాల కామెంట్లతో వైసీపీపై సెటైర్లు వేస్తున్నారు.

“రూమ్ నెంబర్ మార్చుకుంటే సరిపోదు.. ముందు జనం మనసుల్లో పడిపోయిన ఆ 11 ముద్రను ఎలా మారుస్తారు?”

“అక్కడ 11.. ఇక్కడ 11.. పాపం వైసీపీని ఆ నెంబర్ వదిలేలా లేదుగా!”

“సెంటిమెంట్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా!” అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

Analyst KS Prasad Reaction On Mittal Steel Plant | Vizag Steel Plant | CM Chandrababu Naidu | TR