గ్రేటర్‌ నజర్‌: కేసీఆర్‌ ఏం చెప్పబోతున్నారు.?

KCR will include more timelines in their manifesto

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఓటర్లను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారు.? అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో విడుదలయ్యింది. తాము, గ్రేటర్‌ మేయర్‌గిరీ దక్కించుకుంటే, గ్రేటర్‌ ప్రజలకు ఏం చేస్తామో అందులో సవివరంగా పేర్కొన్నారు కేసీఆర్‌. ఈ విషయమై ఇప్పటికే కేసీఆర్‌ స్పష్టత ఇచ్చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ శ్రేణులు ఇప్పటికే ఫుల్‌ జోష్‌ మీద కనిపిస్తున్నాయి.

KCR will include more timelines in their manifesto
KCR will include more timelines in their manifesto

ఈ రోజు సాయంత్రం కేసీఆర్‌, హైద్రాబాద్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా ఇవ్వబోయే సందేశంతో, ఆ జోష్‌ మరింత పెరుగుతుందని గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ శ్రేణులు భావిస్తున్నాయి. కేసీఆర్‌ నిర్వహించే బహిరంగ సభ కోసం డివిజన్‌కి 2 వేల మందికి తక్కువ కాకుండా జనాన్ని తరలించేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ‘కరోనా భయాలు’ ఓ పక్క వున్నాసరే, గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ కూడా అసలు ‘కరోనా ఉనికిని’ ఫీల్‌ అవడంలేదు. టీఆర్‌ఎస్‌ ఈ విషయంలో ఇంకాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నది నిర్వివాదాంశం. రెండు లక్షల మందికి పైగా జనం, కేసీఆర్‌ బహిరంగ సభకు హాజరవుతారనే ప్రచారం జరుగుతోందంటే, కరోనా పట్ల అధికార పార్టీ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్న కేసీఆర్‌..

ప్రధానంగా సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంశంపై బీజేపీకి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఝలక్‌ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తన ప్రసంగంలో ఈ అంశమ్మీదనే ఎక్కువగా కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టబోతున్నారట. దీంతోపాటుగా, దేశ రాజకీయాల గురించీ కేసీఆర్‌ తన ప్రసంగంలో ప్రస్తావించబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకులు చాలామంది, గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటన్నిటికీ సమాధానమివ్వాలంటే, కేసీఆర్‌.. తన స్పీచ్‌ కోసం ఎక్కువ సమయం కేటాయించక తప్పదు. కేసీఆర్‌ ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా, సుదీర్ఘ ప్రసంగమే చేస్తారు. మాట చాలా సూటిగా జనంలోకి వెళ్ళేలా చేయడంలో కేసీఆర్‌ దిట్ట. ఇక, కరోనా వ్యాక్సిన్‌ సహా పలు అంశాలపైనా కేసీఆర్‌, గ్రేటర్‌ ప్రజలకు ఈ బహిరంగ సభ ద్వారా భరోసా ఇవ్వబోతున్నారట.

సెంచరీ పక్కా.. సాధ్యమయ్యే పనేనా?

మంత్రి కేటీఆర్‌, గ్రేటర్‌ ఎన్నికల్లో తాము సెంచరీ కొడతామని ఇప్పటికే చెప్పేశారు. అయితే, తాజా ఇంటర్వ్యూలో మాత్రం కేటీఆర్‌ కొత్త పల్లవి అందుకున్నారు. ‘గౌరవప్రదమైన స్కోరు సాధిస్తాం’ అంటున్నారాయన. ఎక్స్‌ అఫీషియో ఓట్లతో సంబంధం లేకుండానే మేయర్‌ గిరీ దక్కించుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్‌, 100 పైన సీట్లు సాధించే విషయమై మాకు పెద్దగా అనుమానాల్లేకపోయినప్పటికీ, అంతిమంగా అది ఓటర్లు నిర్ణయించాల్సిన అంశమంటూ చాలా వ్యూహాత్మకంగా వ్యాఖ్యానించడం గమనార్హం. అంటే, మొదట వున్న వేడి, గులాబీ శ్రేణుల్లో కాస్త తగ్గుతోందనే భావించాలేమో.

కొత్తగా మరిన్ని హామీలు.?

గ్రేటర్‌ ఎన్నికల ప్రచాంలో భాగంగా కేసీఆర్‌ నిర్వహించబోయే బహిరంగ సభ ద్వారా మరిన్ని తాయిలాలు గ్రేటర్‌ ఓటర్లకు ప్రకటించే అవకాశం వుందట. వివిధ రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోల్ని ప్రకటించిన దరిమిలా, వాటిల్లోంచి కొన్ని పాయింట్లు తీసుకుని, తదనుగుణంగా కొత్త హామీలు కేసీఆర్‌ గుప్పించనున్నారని సమాచారం.