కామారెడ్డి, గజ్వేల్.! రెండిట్లోనూ కేసీయార్ విక్టరీ.!

గజ్వేల్‌లో ఓడిపోవడం ఖాయం.. అందుకే, ప్రత్యామ్నాయంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని కేసీయార్ ఎంచుకున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేతపై అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ విమర్శలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

గజ్వేల్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి.. కేసీయార్‌ని ఓడించేందుకు నానా రకాల వ్యూహాలూ పన్నారు. కానీ, తాజా సర్వేల అంచనాల్ని చూస్తే, రెండు చోట్లా కేసీయార్ గెలవబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలోనూ కేసీయార్‌కి పోటీ ఇవ్వలేకపోయాయి బీజేపీ, కాంగ్రెస్.. ఈ రెండు నియోజకవర్గాల్లో.

రెండు చోట్ల పోటీ చేయడం కేసీయార్‌కి కొత్త కాదు. గతంలో లోక్ సభ నియోజకవర్గానికీ, అసెంబ్లీ నియోజకవర్గానికీ ఒకేసారి పోటీ చేసిన సందర్భాలున్నాయి. లోక్ సభకు రాజీనామా చేసి, అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగారు కేసీయార్ గతంలో.

ఇప్పడిక రెండు చోట్లా కేసీయార్ గెలిస్తే, గజ్వేలు వుంచుకుంటారా.? కామారెడ్డి వుంచుకుంటారా.? అన్నది చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి వైపే కేసీయార్ మొగ్గు చూపుతారని గజ్వేల్ నియోజకవర్గంలోనూ గుసగుసలు వినిపించాయి.

కాగా, గజ్వేల్ నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని మేగ్జిమమ్ తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ నేత ఈటెల రాజేందర్ చాలా చాలా ప్రయత్నించారు. ఆయన ప్రయత్నాలు కొంతమేర సఫలమయ్యాయి కూడా.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు మొదట్లో బాగా కనిపించినా, పోలింగ్ సమీపించేసరికి, కొన్ని నియోజకవర్గాల్లో చేతులెత్తేసిన పరిస్థితిని చూస్తున్నాం. అయితే, ఓటరు నాడి ఏంటన్నది ఇప్పుడే చెప్పలేం. పోలింగ్ రోజున ఈక్వేషన్స్ అనూహ్యంగా మారిపోతాయి. అప్పటిదాకా.. రకరకాల విశ్లేషణలు మామూలే.!