Kavitha Letter: కవిత లేఖ వల్ల బీజేపీ బలం పెరుగుతుందట!

తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కవిత రాసిన లేఖ వారి పార్టీకి మేలు కాకుండా, ప్రత్యర్థి బీజేపీకే బలం చేకూర్చేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబంలోనే విభేదాలు ఉద్భవించాయని స్పష్టం చేస్తూ, ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లో అనిశ్చితిని పెంచుతుందని వ్యాఖ్యానించారు. “కవిత లేఖతో బీఆర్ఎస్ కార్యకర్తలు భ్రమకు లోనవుతారు. బీజేపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడుతుంది” అని హెచ్చరించారు.

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, “కవిత తండ్రిని దేవుడంటూ అదే వ్యక్తిని రాజకీయంగా బలహీనపర్చే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఆమె ఈ లేఖ రాసింది డిప్రెషన్ వల్ల కావచ్చు. బీఆర్ఎస్‌లో నాయకత్వ భ్రమలు బలపడుతున్నాయి. కేసీఆర్ లేకపోతే ఆ పార్టీకి ఉనికే లేదు. కవిత వ్యవహారం తమ కొమ్మను తామే నరుక్కొనడమే” అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ఇక బీజేపీకి తెలంగాణలో నేతృత్వం లేకున్నా, బీఆర్ఎస్ నేతలే వారి బలం పెంచేలా వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు. “కవిత రాసే లేఖలు, మీడియాకు వచ్చే లీకులు తమ శత్రువులైన బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నాయి. కుటుంబ రాజకీయాల మీద మోజుతో కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను పరోక్షంగా పెంపొందిస్తున్నారు” అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు త్వరలోనే కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై వ్యూహాత్మకంగా పోరాటం చేపడతామంటూ జగ్గారెడ్డి హింట్ ఇచ్చారు.

ఖబర్దార్ మోడీ || OU Leaders Protest Against Operation Kagar || BJP Government || Telugu Rajyam