నాదెండ్ల మనోహర్‌కి గాలమేస్తున్న చంద్రబాబు.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి వెన్నుపోటు రాజకీయాలు నడపడం వెన్నతో పెట్టిన విద్య. అది తెలిసీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బొక్క బోర్లా పడుతున్నారు.! పవన్ కళ్యాణ్ అమాయకత్వాన్ని చంద్రబాబు క్యాష్ చేసుకోవడంలో వింతేముంది.? అసలంటూ జనసేన అధినేతను ‘దత్త పుత్రుడు’ అని మొట్ట మొదట పిలిచిందే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పుత్ర రత్నం నారా లోకేష్ ద్వారా ‘బీజేపీ దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్’ అనిపించిందే చంద్రబాబు. ఇప్పుడేమో ‘చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్’ అని వైసీపీ ఆరోపిస్తోంటే, పవన్ కళ్యాణ్.. వైసీపీ నేతలకు ‘చెప్పు’ చూపిస్తున్నారు.

అసలు విషయానికొస్తే, టీడీపీ అధినేత చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌కి గాలమేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట. ‘అబ్బే, ఇదంతా వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్’ అని జనసేన నేతలు కొట్టిపారేయొచ్చుగాక. కానీ, చంద్రబాబు నైజం తెలిసినోళ్ళెవరైనా జనసేన అమాయకత్వాన్ని చూసి జాలిపడకుండా వుండలేరు.

ప్రస్తుతానికైతే జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ ‘నెంబర్ టూ’ పొజిషన్‌లో వున్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత ఆయనే. నిజానికి, పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏ అడుగు వేయాలన్నా అది డిసైడ్ చేసేది కూడా నాదెండ్ల మనోహరే. సో, ఆ నాదెండ్ల మనోహర్‌ని తనవైపుకు తిప్పకుంటే ‘పని’ తేలికవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్టున్నారు.

టీడీపీతో పొత్తు విషయమై జనసేనాని పునరాలోచన చేస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలోనే చంద్రబాబు ఈ కొత్త రాజకీయానికి తెరలేపారు. మహాసేన రాజేష్, కన్నా లక్ష్మినారాయణ.. వీళ్ళంతా జనసేన వైపు వెళ్ళలేదంటే దానికి కారణం చంద్రబాబే.!