రైలులో తరచుగా ప్రయాణించే వారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నిబంధనను భారతీయ రైల్వే తాజాగా ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇకపై వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నవారు స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణించలేరు. కేవలం జనరల్ బోగీల్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది.
ప్రయాణంలో కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారి సౌకర్యం దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. చాలాసార్లు వెయిటింగ్ టికెట్ ఉన్నవారు స్లీపర్ లేదా ఏసీ బోగీల్లో కూర్చోవడం వల్ల అక్కడున్న ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు గుర్తించారు. దీనివల్ల మార్గాలు కూడా ఇరుకుగా మారుతున్నాయంటున్నారు.
కొత్త నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తప్పవు. వెయిటింగ్ టికెట్తో స్లీపర్ కోచ్లో ప్రయాణిస్తే రూ.250 జరిమానాతో పాటు, పూర్తి ప్రయాణ ఛార్జీని వసూలు చేస్తారు. ప్రయాణ దూరాన్ని బట్టి అదనపు ఛార్జీలు కూడా విధించనున్నారు. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీలో ప్రయాణిస్తే జరిమానా మరింత అధికంగా ఉంటుందని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి.
అదే విధంగా, నిబంధనలు అతిక్రమించిన ప్రయాణికుడిని జనరల్ కోచ్కు తరలించడమే కాకుండా, అవసరమైతే తదుపరి స్టేషన్లో రైలు దిగిపోవాల్సిందిగా ఆదేశించనున్నారు. ఫస్ట్ క్లాస్ లేదా ఏసీ కోచ్లో ఈ నియమం ఉల్లంఘిస్తే జరిమానా సుమారు రూ.440 వరకు పెరగొచ్చని అధికారులు తెలిపారు.
మొత్తం మీద, మే 1 నుంచి రైలు ప్రయాణీకులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కన్ఫర్మ్ టికెట్ లేకుండా స్లీపర్ లేదా ఏసీ కోచ్లో ప్రయాణించే ప్రయత్నం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ముందుగానే టికెట్ కన్ఫర్మ్ చేసుకుని ప్రయాణం చేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.