న్యాయవ్యవస్థకే మచ్చ తెచ్చిన గొగోయ్ 

సుమారు పాతికేళ్ల క్రితం అని గుర్తు…చీఫ్ జస్టిస్ రంగనాథ్ మిశ్రా పదవీవిరమణ చేసిన ఐదారేళ్ళ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యాడు.  ఆరేళ్లపాటు ఆ పదవిలో కొనసాగాడు.  ఎందుకు ఆయనకు ఆ పదవి దక్కిందయ్యా అంటే…ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన అల్లర్లు, సిక్కుల ఊచకోత మీద ఏర్పాటు చేసిన ఏకసభ్య కమీషన్ కు ఆయన అధ్యక్షుడు.  విచారణ జరిపి  కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చాడు!  అందుకు బహుమతిగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చి గెలిపించిందని ఆరోపణలు ఉన్నాయి.  
 
దాదాపు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చీఫ్ గా పనిచేసిన  జస్టిస్ ప్రభా శంకర్ మిశ్రా  మీద అనేక దారుణమైన ఆరోపణలు వచ్చాయి.  అప్పట్లో ఒక కేసులో  చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి చంద్రబాబు ఆయనకు ఒక సినిమా నటిని తాయిలంగా సమర్పించారని నేటికీ చెప్పుకుంటారు…దీనిలో వాస్తవం ఎంతో తెలియదు.  ఏమైనప్పటికీ, ఆయన చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారనేది వాస్తవం.  
 
అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కక్రూ జగన్ మీద మోపడిన అక్రమాస్తుల కేసులో నాటి సోనియా, చంద్రబాబుల మనసెరిగి వెంటనే విచారణ చేపట్టడమే కాక జగన్ మీద సిబిఐ విచారణకు ఆదేశించారు.  ఫలితంగా ఆయన పదవీవిరమణ చేసిన ఇరవై నాలుగు గంటలు తిరగకముందే ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల సంఘం చైర్మన్ గా నియమించారు!  నిజానికి కక్రూ కాశ్మీర్ కు చెందినవాడు.  ఆయనకు తెలుగు భాష ఏమాత్రం రాదు.  తెలుగు ఆచారాలు, సంప్రదాయాలు, భావోద్వేగాలతో ఆయనకు అసలు పరిచయం లేదు.  అలాంటి వాడిని ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘానికి చైర్మన్ గా నియమించారంటే ఆశ్చర్యంగా లేదూ?   
 
నాలుగు నెలల క్రితమే సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ రంజన్ ను ఎవరూ ఊహించని రీతిలో రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసింది మోడీ ప్రభుత్వం.  దీనిమీద దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి.  గొగోయ్ చేసిన ఘనకార్యాలు ఏమిటి?  ఆయన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది కేవలం పదమూడు మాసాలు.  ఈ స్వల్ప సమయంలో ఆయన శబరిమలైలో మహిళలకు ప్రవేశం, రాఫెల్ విమానాల కొనుగోలులో మోడీ ప్రభుత్వానికి క్లీన్ చిట్, అయోధ్య వ్యవహారంలో ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు, ఆర్టికల్ 370 రద్దుపై అనుకూలం,…ఇలా దేశాన్ని రగిలిస్తున్న అనేక సమస్యల మీద ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చారు.  ఫలితమే ఈ రోజు గొగోయ్ ను రాజ్యసభకు నామినేట్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.   రాజ్యసభ సభ్యత్వం అంటే నెలకు మూడు లక్షల రూపాయల వేతనం, విలాసవంతమైన బంగాళా, ప్రభుత్వ కారు, సిబ్బంది, ప్రోటోకోల్, హంగామా, ఎంపీ లాడ్స్,  దేశంలో ఎక్కడికైనా ఉచిత విమానయాన సౌకర్యం, ఇంకా అనేక సదుపాయాలు ఉంటాయి.  
 
 గొగోయ్ నిర్వహించిన సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పదవితో పోల్చితే ఈ రాజ్యసభ పదవి ఎంత?  ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పార్లమెంట్ చేసిన చట్టాలను సైతం కొట్టివేసి అధికారాలను కలిగి ఉన్నాడు.  ఆయన ఎవరైనా మంత్రిని తప్పు పడితే ఆ మంత్రి తక్షణం రాజీనామా చేసి పోవాల్సిందే.  దేశంలో ఎవరైనా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఆ ముఖ్యమంత్రి పదవి పోతుంది.  గవర్నర్లు, ఎలెక్షన్ కమీషనర్లు, రాజ్యాంగ సంస్థల అధినేతలు తీసుకున్న నిర్ణయాలను కొట్టేసే అధికారం కలిగిన పదవి అది.  అలాంటి వ్యక్తి గుంపులో గోవిందా లాంటి రాజ్యసభ సభ్యుడి పదవిని స్వీకరించారంటే ఆయన వ్యక్తిత్వానికే కాదు..న్యాయవ్యవస్థకు కూడా అతి పెద్ద మచ్చగా మిగిలిపోతుంది.  అంతే కాదు…ప్రస్తుత సుప్రీమ్ కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల మీద  ఈ నియామకం ప్రభావాన్ని చూపిస్తుంది.  ఎంత జడ్జీలైనా వారు మానవమాత్రులే.  వారికీ కుటుంబాలు, కోరికలు, విలాసాలు, జల్సాల మీద మోజు ఉంటాయి..  ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇస్తే రిటైర్ అయ్యాక మరో ఆరేళ్ళ పాటు భోగమయ జీవితాన్ని గడపవచ్చు అనే అభిప్రాయం వారిలో ఏర్పడటానికి అవకాశం ఉంటుంది.   వారి మనసులను కలుషితం చేస్తాయి.  
 
ఈదేశంలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయని, ఒక్క న్యాయవ్యవస్తే కొంచెం పరిశుద్ధంగా ఉన్నదని ప్రజలు నమ్ముతారు.  ప్రభుత్వం మనకు అన్యాయం చేసినపుడు న్యాయస్థానం తలుపు తడితే మనకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం సజీవంగా ఉన్నది.  ఇలాంటి సమయంలో పదవీవిరమణ చేసిన న్యాయమూర్తులకు పదవుల ఆశలు చూపుతూ వారి మనసులను చంచలింపజెయ్యడం ఘోరం.  ఒకసారి ప్రభుత్వంలో పదవీవిరమణ చేసిన వారు చట్టసభలకు ఎన్నిక లేదా ఎంపిక కావడం, కమీషన్ల పదవులు, అధ్యక్ష పదవులు…అలాగే ఎలాంటి లాభదాయక పదవులు చేపట్టకుండా కఠినమైన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.  
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు