కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు అధికారంలో ఉంటె మరీ పెద్ద పండుగ.  అందుకే క్షేత్రస్థాయి వాస్తవాలతో నిమిత్తం లేకుండా తట్టెడు పేడలో తన నోటి దుర్గంధాన్ని రంగరించి చల్లి ఆనందిస్తుంటాడు.  “కరోనా కార్చిచ్చు” పేరుతో “అబ్బో…కరోనా గురించి రాధాకృష్ణ ఎంత బాధ్యతగా రాస్తున్నాడో గదా” అని మనం ఆనందించేలోపే తన శునకబుద్ధిని నిస్సిగ్గుగా ప్రదర్శించేశాడు.  రాస్తే రాశాడు…కానీ, మన దేశంలో కరోనా విజృంభించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కారణం అన్నట్లుగా తన అక్కసును ప్రదర్శించాడు.  ఎక్కడా మోడీ ప్రస్తావన లేదు.  దేశంలోకి కరోనా ప్రవేశించడంతో కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యం గూర్చి మాట మాత్రం ప్రస్తావించలేదు.  అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేశాడు.  ఎందుకంటే కేసీఆర్ కన్నెర్ర జేస్తే రాధాకృష్ణ తుక్డా తుక్డా అయిపోవడానికి ఆరనిముషం పట్టదు.  ఇక ఉన్నదెవరు?  అన్నిటికి పాపాలభైరవుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు!  పాపం ఆయనకు నోరువాయి లేదు.  పరమ శాంతమూర్తి.  రాధాకృష్ణ, రామోజీరావు లాంటి చీడపురుగులను బెదిరించలేడు.     అందుకనే జగన్ మీద ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నాడు.  
 
***
“ఈ లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని ఫిబ్రవరి చివరి వారం నుంచే అమలుచేసి విదేశాల నుంచి వచ్చే వారిని నేరుగా క్వారంటైన్‌కు తరలించి ఉంటే ఇప్పుడు ఈ మహమ్మారి ఇంతలా వ్యాపించి ఉండేది కాదు. మన దేశం కూడా ప్రారంభంలో నిర్లక్ష్యం వహించింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి ప్రారంభంలో కరోనాను సీరియస్‌గా తీసుకోలేదు. ”కరోనాది ఏముంది.. పారాసిటమాల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది..” అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం వారం గడిచేసరికి పరిస్థితి తీవ్రతను అంచనా వేసి విరుగుడు చర్యలకు శ్రీకారం చుట్టారు…”
 
నిజానికి ఈ లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకోవాల్సింది ఎవరు?  గత నవంబర్ లో కరోనా గూర్చి అలజడి మొదలైతే, పదిరోజుల క్రితం వరకు కళ్ళు తెరవని గుడ్డి ప్రభుత్వం కేంద్రంలో ఉంటె, దాన్ని గూర్చి మాటమాత్రం కూడా రాధాకృష్ణ ప్రస్తావించడు.  అంతర్జాతీయంగా కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తుంటే,  రాష్ట్రాలను అప్రమత్తం చెయ్యాల్సిన కేంద్రం మొన్నటిదాకా ఒక్క జాగ్రత్త తీసుకున్న దాఖలా ఉన్నదా?  జనతా కర్ఫ్యూ పాటించాలని మోడీ విజ్ఞప్తి చేసేరోజు వరకు కేంద్రం ఒక్కసారైనా కరోనా గూర్చి మాట్లాడిందా?  కానీ, మోడీని విమర్శించడానికి దమ్ము లేదు.  ఎందుకంటే మాయలఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు తన యజమాని చంద్రబాబు ప్రాణం ఇప్పుడు మోడీ గుప్పెట్లో ఉన్నది.  అమరావతి దోపిడీ మీద సిబిఐ విచారణకు రాష్ట్రం ఆదేశించడంతో ఎప్పుడు చంద్రబాబుకు మూడుతుందో తెలియదు.  అందుకనే  నెలరోజుల క్రితమే చంద్రబాబు మోడీ స్తోత్రాలు ప్రారంభించాడు.  దానికి రాధాకృష్ణ కూడా వంత పాడటంతో వింత ఏమున్నది?  
 
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా కరోనా గూర్చి భయపడనక్కరలేదని, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని  తొలుత భావించి ఉండవచ్చు.  ప్రజలకు ధైర్యం చెప్పడానికి అలా మాట్లాడి ఉండవచ్చు.  అలా చెబుతూనే నివారణ చర్యలను ఇద్దరు ముఖ్యమంత్రులూ ఏకకాలంలోనే చేపట్టారు.  కాకపొతే వారిద్దరూ చంద్రబాబులా డప్పు కొట్టుకోరు.  అలాగే పచ్చ మీడియా కూడా వారు తీసుకుంటున్న చర్యలకు ప్రచారం ఇవ్వదు. వారిద్దరూ పటిష్టమైన చర్యలు తీసుకోబట్టే దేశం మొత్తంలో తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయి.  ఇక తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కేసులు చాలా తక్కువగా ఉన్నాయి.  అందుకు కారణం అక్కడి వాలంటీర్ల వ్యవస్థ.  ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండటంతో వేరే ప్రాంతాల నుంచి ఎవరు వస్తున్నారు?  ఎక్కడినుంచి వస్తున్నారు అనే విషయాలు క్షణాల్లో ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నాయి.  అయినప్పటికీ ప్రభుత్వం కళ్లుగప్పి కొందరు కరోనా పరీక్షల నుంచి తప్పించుకుంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో కేసులు తక్కువగా ఉండటానికి కారణం వాలంటీర్ వ్యవస్థ మాత్రమే అని జాతీయ మీడియా కూడా ప్రశంసలు కురిపిస్తున్న విషయం మన బాధాకృష్ణకు తెలియదేమో!.  
 
తెలంగాణాలో వలంటీర్ల వ్యవస్థ లేకపోవడంతో విదేశాల నుంచి వస్తున్నవారిని గుర్తించడం కష్టం అవుతున్నది.  ఉదాహరణకు కొత్తగూడెం డిఎస్పీ కుమారుడు లండన్ నుంచి వచ్చాడని ఎవరూ గుర్తించలేకపోయారు.  ఫలితంగా కరోనా ఆ కుటుంబంలో ముగ్గురు సభ్యులు కరోనా బారిన పడ్డారు.  ఇలా ఇంకెందరున్నారో?  
 
 
ఇలాంటి అంటువ్యాధుల విషయాల్లో ప్రభుత్వాలే కాదు.. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలి.  లాక్ డౌన్ ప్రకటించినా జనం ఇష్టం వచ్చినట్లు రోడ్లమీద తిరుగుతున్నారు.  మనవి ప్రజాప్రభుత్వాలు కాబట్టి నియంతృత్వధోరణిని ప్రదర్శించడానికి ప్రభుత్వాలు ఇష్టపడవు.  ప్రజలు బాధ్యతను గుర్తెరిగి సహకరించాలి.  
 
***
 
“ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయానికి వస్తే.. ఆయన కరోనా వైరస్‌ అనేది ఒక మహమ్మారి అని గుర్తించడానికి కూడా ప్రారంభంలో అంగీకరించలేదు. ఇప్పటికీ ఆయన ఈ వైరస్‌ ప్రమాదాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. కరోనా వైరస్‌ విజృంభించే ప్రమాదం ఉందన్న కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ప్రకటించగానే ఆయనకు కులాన్ని ఆపాదించి తిట్టిపోశారు. ”కరోనా వైరస్సా.. కాకరకాయా..” అన్న రీతిలో అవాకులు– చవాకులు పేలారు. జగన్మోహన్‌రెడ్డి తన సొంత మీడియాలో రమేశ్‌కుమార్‌పై దుమ్మెత్తి పోయించారు. ”కరోనా వైరస్‌తో ఇప్పటివరకు ప్రపంచంలో నలుగురే చనిపోయారనీ, రహదారి ప్రమాదాల్లో, క్యాన్సర్‌ వంటి వ్యాధుల వల్ల యేటా లక్షల మంది చనిపోతున్నారనీ, దాంతో పోలిస్తే కరోనా ఎంత? ఇదంతా కుట్ర..” అని పిచ్చి వాగుడు వాగించారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడం కంటే స్థానిక ఎన్నికలు జరిపించడమే ముఖ్యం అన్నట్టు మూర్ఖంగా ప్రవర్తించారు.”
 
జగన్ మీద ఎంత కసి!  ఎంత ద్వేషం!  ఓ రాధాకృష్ణా…పిచ్చివాగుడు…మూర్ఖత్వం…అవాకులు చవాకులు …ఎంత గొప్ప పదప్రయోగాలు ఒక ముఖ్యమంత్రి పట్ల!  జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా సరే…మిగిలిన నికృష్ట పచ్చ మీడియా సంగతి ఏమిటి?  ఇరవైనాలుగు గంటలు చంద్రబాబు విసిరే ఎంగిలి బిస్కట్లను ఏరుకుంటూ జగన్ మీద బురద చల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్న అతి పెద్ద కులగజ్జి వైరస్ మీడియా వాగేవి మూర్ఖపు పిచ్చి ప్రేలాపనలు కావా?  
 
***
 
“ఏపీ ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ మధ్య వ్యంగ్యాస్త్రాలు సంధించినట్టు తెలిసింది. ”అతడు ఎవరి మాటా వినడు. సమస్యను అర్థం చేసుకోడు. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ మాదిరిగా వ్యవహరిస్తున్నాడు..” అన్న వ్యాఖ్యలు కేసీఆర్‌ తన సన్నిహితుల వద్ద చేశారని చెబుతున్నారు. తెలంగాణకు చెందిన మంత్రులు కూడా జగన్మోహన్‌రెడ్డి వైఖరిని ఆక్షేపిస్తున్నారు.”
 
అదిగదిగో…మళ్ళీ వేసేశాడు రాధాకృష్ణ!  “ట” కార ప్రయోగాలతో ఎవరిమీదైనా మనం నిందలు వేసేయ్యొచ్చు… కేసీఆర్ అలా అన్న సన్నిహితులు ఎవరో ఆ సన్నిహితులకు కూడా తెలియకపోవచ్చు మన రాధాకృష్ణకు తప్ప.  ఇక నాకు తెలిసి తెలంగాణ మంత్రులు ఎవరూ రాధాకృష్ణలా బుద్ధిహీనులు కారు…పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించడానికి!  
 
***
 
“తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్‌ 14 తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉన్నందున నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. నిత్యావసర సరుకులను డోర్‌ డెలివరీ చేయాలి. దీనివల్ల రోడ్లపై జన సంచారాన్ని అరికట్టవచ్చు.”
 
పాపం…రాధాకృష్ణకు కరోనా కారణంగా విలేకరుల కొరత ఏర్పడినట్లున్నది.  రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశం విషయంలో ఏనాడో యాక్షన్ కూడా ప్రారంభించారు.  తెల్ల కార్డులు ఉన్నవారికి ఇంటివద్దే రేషన్ అందజేస్తున్నారు.  ఆర్థికసాయం కూడా అందిస్తున్నారు.  కళ్ళున్న అంధుడికి ఎవరు చెప్పగలరు?  
 
***
 
ఇక బాధాకృష్ణ తన చెత్తపలుకులో కొన్ని అంశాలను ప్రస్తావించడం మరచిపోయాడు…లేదు లేదు…కావాలనే విస్మరించాడు.  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, నలభై ఏళ్ల అనుభవం కలిగిన మొనగాడు…ఈ విపత్కరసమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ అక్కడి ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ, ప్రజలను చైతన్యవంతులను చెయ్యాల్సిన పెద్దమనిషి తెలంగాణాలో వచ్చి ఎందుకు దాక్కున్నట్లో రాధాకృష్ణ చెబుతాడేమో అని చూశాను.  ఆబ్బె….లేదు..
 
ఇక వందరోజులుగా షామియానాలు వేసుకుని జగన్ మీద ద్వేషం కక్కుతున్న కొందరు పెయిడ్ ఆర్టిస్టులు కరోనా విస్తరిస్తోందన్న భీతి కూడా లేకుండా మొరుగుతుంటే …అలా గుంపుగా కూర్చోకూడదు…తాత్కాలికంగా ఉద్యమాన్ని ఆపి ఇళ్లకు వెళ్లి ప్రభుత్వానికి సహకరించండి…అని ఒక సలహా ఇస్తాడేమో అని గాలించాను….అబ్బెబ్బే…లేదు..
 
సాటిమనిషి దగ్గరకు వస్తుంటేనే ఎక్కడ వైరస్ అంటుకుంటుందో అని వణికి చేస్తున్న ఈ తరుణంలో హైద్రాబాద్ లో నివసిస్తున్న మూడు నాలుగువేలమంది ఆంధ్రులు ఎవరో తరిమినట్లు ఒకేసారి కట్టగట్టుకుని ఆంధ్రకు వెళ్లాలని తెలంగాణ బోర్డర్ దగ్గర ఆందోళన చేస్తుంటే…క్వారంటైన్ కు అంగీకరిస్తేనే అనుమతిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో బాధ్యతగా చెప్పినపుడు, అదేదో పెద్ద నేరం అన్నట్లు బీజేపీలోని తమ బానిసలతో హైకోర్టులో కేసు వేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు తెప్పించినపుడు …అలా చెయ్యడం తప్పు అని ఎక్కడైనా చెత్తపలుకులో దొరుకుతుందేమో అని వెతికాను…లేనే లేదు..అలాగే హైకోర్టు బాధ్యతారాహిత్యాన్ని కూడా కాస్త ఎత్తి చూపుతాడేమో అని దురాశ పడ్డాను……తెలంగాణాలో ఎవరైనా ప్రవేశించాలంటే వైద్యపరీక్షలు చేసి, వైరస్ ఉన్నవారు క్వారంటైన్ కు ఒప్పుకుంటేనే లోపలకు రానిస్తున్నారు.  మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అలాంటి జాగ్రత్తలు తీసుకోదా?  తెలంగాణ నుంచి వెళ్ళినవారు అక్కడ మరికొందరికి అంటిస్తే ఆ బాధ్యత ఎవరిదీ?  రాధాకృష్ణ తీసుకుంటాడా లేక చంద్రబాబు నాయుడు తీసుకుంటాడా?  లేక బీజేపీ వాళ్ళు తీసుకుంటారా? 
 
సబ్జెక్ట్ ఏదైనా కానీ….జగన్ మీద ద్వేషం, విషం చిమ్మడం మాత్రం రాధాకృష్ణ మర్చిపోడు.  అందుకే అది చెత్తపలుకుగా పాఠకుల చీత్కారాలను అందుకుంది.  గుడ్డివాడి చేతిలో దీపం, రాధాకృష్ణ చేతిలో కలం, రంభ కౌగిట్లో నపుంసకుడితో సమానం!!  
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు