‘మేం కూడా మీ దారిలోనే రాజకీయం చేయబోతున్నాం. రాజకీయంగా కొత్త కోణాన్ని జనసేన పార్టీ నుంచి చూడబోతున్నారు..’ అంటూ జనసేన నేతలు ఈ రోజు మీడియా ముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించిన విషయం విదితమే. ఈ క్రమంలో వైసీపీకి చెందిన పలువురు మంత్రులు, జనసేనానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘బోడి లింగం – షకీలా సాబ్’ అంటూ ఇరువురి మధ్యా విమర్శల పర్వం నడుస్తోంది. ఈ క్రమంలో జనసేన నేతలు పోతిన మహేష్, బోనబోయిన శ్రీనివాస్యాదవ్ మీడియా ముందుకొచ్చారు. వైసీపీని చెడమడా తిట్టేశారు. మంత్రులపై విరుచుకుపడ్డారు. ‘బోడి లింగాలు’ అంటూ విమర్శల పర్వాన్ని కొనసాగించారు. ఇవన్నీ ఓ ఎత్తు.! ‘మీ దారిలోనే రాజకీయం చేయబోతున్నాం’ అని చెప్పడం ఇంకో ఎత్తు. ‘చంద్రబాబు అవినీతిని ఎండగట్టాం.. ఇప్పుడాయన మూలన కూర్చున్నారు.. జగన్ అవినీతిని ఎండగట్టబోతున్నాం.. మీరు కూడా మూలన కూర్చుంటారు..’ అని జనసేన నేతలు వైసీపీపై విరుచుకుపడ్డారు. అదసలు సాధ్యమయ్యే పనేనా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి రాజకీయాలపై చిత్తశుద్ధి ఎంత.? అన్నదిక్కడ కీలకమైన అంశం. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ నిత్యం జనంలో వున్నారు.

అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ, కోర్టుకు ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సి వచ్చినా, ప్రజా సంకల్ప యాత్ర ఆపలేదు. కానీ, అంత సీరియస్ పాలిటిక్స్ జనసేన అధినేత చేయగలరా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘టీడీపీకి అమ్ముడుపోయిన పవన్ కళ్యాణ్..’ అనే విమర్శల్ని జనసేన బలంగా తిప్పికొట్టగలగాలి. ఆ విషయంలోనే జనసేన పూర్తిస్థాయిలో సఫలమవలేకపోతోంది. అలాంటిది, పవన్ కళ్యాణ్ నుంచి సీరియస్ పాలిటిక్స్ అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. పైగా, జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోంది.. అంటూ జనసేన నేతలు ఇంకాస్త ఎక్కువ ఊహించేసుకుంటున్నారు తమ పార్టీ గురించి. ‘బీజేపీ – జనసేన’ ప్రభుత్వం అని కమలనాథులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి.. అని బీజేపీ కూడా ఇప్పటిదాకా ఎప్పుడూ చెప్పలేదాయె. సరే, ఎన్నికల వేళ ఈక్వేషన్స్ ఎలా వుంటాయన్నది వేరే చర్చ. ఓ పక్క ఎడా పెడా సినిమాలకు కమిట్ అవుతూ, రాజకీయాల్లో సీరియస్గా వుండాలంటే.. జనసేన అధినేతకు సాధ్యమయ్యే పనే కాదు.
