ఎగ్జిట్ పోల్స్ చెప్పినదానికంటే భిన్నంగా బీహార్ ఎన్నికల్లో మొదటి గంటవరకు వెనుకబడిన ఎన్డీయే కూటమి హఠాత్తుగా పుంజుకుని ఆర్జేడీ కూటమిని దాటిపోవడం అనూహ్య పరిణామం. అయితే ఈ దూకుడు చివరి వరకు ఉంటుందా లేదా అనేది తేలాలంటే సాయంత్రం దాకా ఆగక తప్పదు. ఈ ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభించినప్పటినుంచి తేజస్వి యాదవ్ సారధ్యంలోని కూటమి ఆధిక్యత కనబరచసాగింది. దాదాపు నూటపన్నెండు స్థానాల వరకూ ఆధిక్యతను కొనసాగించిన ఆర్జేడీ కూటమిని ఒక్కసారిగా ఎన్డీయే కూటమి అధిగమించింది. మొదటి వంద స్థానాల అంచనాలు వెలువడేవరకు రెండు కూటముల మధ్య చాలా తేడా కనిపించింది. ఒక దశలో ఇద్దరూ సమానంగా వచ్చి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. కానీ, ఆ క్షణం నుంచే ఊహించనివిధంగా ఆర్జేడీ కూటమిని దాటుకుని అయిదు సీట్లవరకు ఎన్డీయే కూటమి ముందుకు వెళ్ళిపోయింది. ఈ వార్త రాసే సమయానికి ఎన్డీయే కూటమి 130 స్థానాలకు చేరువలో ఉండటమే కాక, ఆర్జేడీ కూటమి బలం వందకు దిగిపోయింది. ఈ ట్రెండ్స్ ను బట్టి చూస్తే మళ్ళీ నితీష్ కుమార్ ప్రభత్వం ఏర్పడటం ఖాయంగా తోస్తున్నది.
ఈ ఎన్నికల్లో మరొక విశేషం ఏమిటంటే, బీహార్ వలస కార్మికుల సమస్యను బీజేపీ, నితీష్ కుమార్ లు సరిగ్గా డీల్ చేయలేకపోయారని విమర్శలు వినిపించినప్పటికీ, బీజేపీ కి సొంతంగా బలం ఎక్కువ పెరగడం విశేషం. ఆర్జేడీ సొంత బలం గతం కన్నా తక్కువకు దిగిపోవడం మరొక విశేషం. తేజస్వి యాదవ్ యువ నాయకత్వం, పదిలక్షలమందికి ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానం యువతను ఆకర్షించినప్పటికీ, ఆ ప్రభావం ఓటింగులో కనిపించకపోవడం విచిత్రం. నితీష్ కుమార్ ఎంత సమర్ధవంతంగా, నిజాయితీగా పాలించినప్పటికీ, మద్యనిషేధం ఆయన్ను దెబ్బకొడుతుందని భావించారు. అయినప్పటికీ నితీష్ కుమార్ వాటిని తట్టుకుని మళ్ళీ జయకేతనం ఎగురవేయగలిగారు అంటే అది నితీష్ కుమార్ కు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ గా భావించాలి.
ఇక తేజస్వి యాదవ్ విషయానికి వస్తే ఆయన దాదాపు విజయపు అంచులదాకా వెళ్లి స్వల్పతేడాతో వెనుకపడ్డారు. అంటే ఆయన ఇలాగే కృషి చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలను ఓటర్లు ఇచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలో జరిగిన అరాచకాలు, ఆటవికపాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదని, మరో తరం గడిచాక కానీ, తేజస్వికి అవకాశం ఇవ్వకూడదని ప్రజలు తలపోశారని సరిపెట్టుకోవాలి. అంతే కాకుండా, ఎన్నికల ప్రచార చివరి దశలో “నాకు ఇవే చివరి ఎన్నికలు” అంటూ నితీష్ కుమార్ ప్రయోగించిన సెంటిమెంట్ కూడా కొంత పనిచేసింది. పదిహేనేళ్ళు నిజాయితీగా పాలించారు. మరొక అవకాశం ఇచ్చి చూద్దాం అని ఓటర్లు భావించారనుకోవాలి.
ఏమైనప్పటికీ మోడీ నాయకత్వంలో కోవిద్ నేపథ్యంలో జరిగిన పెద్ద రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి లభించిన విజయం మోడీకి ఒక ధ్రువపత్రం లాంటిది. బీజేపీ పట్ల ప్రజలలో పెరుగుతున్న విశ్వాసానికి సూచికగా బీహార్ ఎన్నికలు అవతరించాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో బీజేపీ ఎక్కువ స్థానాలు గెల్చుకోవడం ఆ పార్టీకి నైతికంగా గొప్ప విజయం. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రోజురోజుకూ దూరం అవుతున్నదని కూడా ఈ ఎన్నికలు రుజువు చేశాయి. నాయకత్వ సమస్య ఆ పార్టీని పీడిస్తున్నది.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు