హర్యానా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓట్ల చోరీకి పాల్పడిందని, దీనిపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘హైఓల్టేజీ హైడ్రోజన్ బాంబు’ పేల్చారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
గురువారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో పీసీసీ సీనియర్ నేతలు జేడీ శీలం, మస్తాన్ వలి, నరహరిశెట్టి నరసింహారావు తదితరులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.
“హర్యానాలో 25 లక్షల దొంగ ఓట్లను సృష్టించి బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడింది” అని షర్మిల ఆరోపించారు. ఈ అక్రమాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 17.65 లక్షల సంతకాలను సేకరించి ఢిల్లీకి పంపుతున్నట్లు ఆమె ప్రకటించారు.

షర్మిల చేసిన ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆమె వ్యాఖ్యలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరిచేలా ఉన్నాయని బీజేపీ మండిపడింది.
బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికారిక ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ ఈ సందర్భంగా స్పందిస్తూ… “దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత ఎన్నికల సంఘం మూల స్తంభం. దానిపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చెత్త ఆరోపణలు, అబద్ధాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదం” అని ఆయన వ్యాఖ్యానించారు.
హర్యానాలో బీజేపీ దొంగ ఓట్లకు పాల్పడిందన్న కాంగ్రెస్ ఆరోపణలు, దానిని బీజేపీ ఖండించడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

