చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌… ఏపీ ‍ప్రభుత్వం కీలక నిర్ణయం!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్‌ – 3 ప్రయోగం చివరి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో చంద్రుడిపై చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. చరిత్రకు అడుగు దూరంలో చంద్రయాన్‌ నిలిచింది. ఈ సమయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

అవును… విక్రమ్‌ ల్యాండర్‌ నేడు చంద్రుడిపై అడుగుపెట్టనుంది. సాయంత్రం 6:04 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండర్‌ పాదం మోపనుంది. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ప్రత్యక్ష ప్రసారాలు అందించనున్నారు.

ఈ సమయంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ప్రభుత్వ పాఠశాలల్లో వీక్షించే ఏర్పాట్లు చేయాలని జిల్లాల డీఈవోలకు ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో… పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్యాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాటు చేస్తున్నారు.

కాగా… సాయంత్రం 5:20 గంటల నుంచి ఇస్రో లైవ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకూలంగా జరిగి ల్యాండర్‌ సేఫ్‌ గా దిగితే.. చంద్రుడి దక్షిణ ధృవంపై సేఫ్‌ ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌ ఖ్యాతిని గడించనుంది. ఈ కీలక ఘట్టానికి మరికొన్ని గంటలే ఉండటంతో భారత్‌ తో పాటు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.