టిడిపి నేతలకు ‘గోల్డెన్ షేక్ హ్యాండ్’, ఆకర్షణీయంగా చంద్రబాబు విఆర్ ఎస్ ,

(గోసాల ప్రసాద్*)

తెలుగుదేశం పార్టీ 1982 మార్చిలో పుట్టింది. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ శూన్యం లో కొత్త పార్టీ ఆవిర్భావం అనివార్యమైంది. అప్పటికే తెలుగు వెండితెర ఆరాధ్యదైవం గా కొనియాడబడుతున్న నటరత్న నందమూరి తారక రామారావు ( ఎన్టిఆర్) రాజకీయాల్లో కి వస్తారా అన్న చర్చలు జరుగుతున్నాయి. భవనం వెంకట్రామ్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఎన్.టి.ఆర్ కు రాజ్యసభ సీటు ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్న ప్రచారం సైతం అప్పట్లో జరిగింది. సినీరంగంలో అప్రతిహతంగా సాగుతున్న ఎన్టీఆర్ ప్రయాణం రాజకీయ రంగంవైపు మళ్ళిన తర్వాత కాంగ్రెస్ నుంచి నాదెండ్ల భాస్కర రావు, సోషలిస్టు భావాలు కలిగిన  బి. సత్యనారాయణ రెడ్డి, బెజవాడ పాపిరెడ్డి వంటి వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇది చరిత్ర.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొమ్మిది నెలలకే తొలి కాంగ్రెసేతర పార్టీగా తెలుగు దేశం పార్టీ ప్రస్తానం ప్రారంభించింది.  రాష్ట్రంలో ఇప్పుడున్న సీనియర్ నాయకులకే చెలామణి అయ్యే వారంతా 1978లో జనతా, రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ పార్టీల ద్వారానే రాజకీయ ఆరంగేట్రం ప్రారంభించిన వారే.

తెలుగుదేశం పార్టీ ద్వారా అగ్ర వర్ణాలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు, బిసి వర్గాలకు చెందిన వారు కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇందులో గ్రామ సర్పంచులుగా పని చేసిన వారు సైతం ఉన్నారు. ఇప్పటి తరం అంతా 1978లోను, 1983 లోను రాజకీయ జీవితం ప్రారంభించిన వారే తప్ప మధ్యలో కొత్త తరం రాజకీయ నేతలు పుట్టుకు రాలేదు. ఈ లోటు తెలుగుదేశం పార్టీతో పాటు అన్ని పార్టీలలోనూ ఉన్నదే.

 

అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తనదైన ముద్ర ఉందని చెబుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి అంచలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఇప్పటికి మూడు దఫాలు గా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినా , తన ముద్రతో వచ్చిన రాజకీయ అనుచరులను ఒక్కరినీ సంపాదించుకోలేకపోయారు.

 

ఎన్.టి.ఆర్ తో రాజకీయాల్లోకి వచ్చిన వారందరూ ఎన్టీఆర్ స్కూల్ ఆఫ్ థాట్ గా పేరు పొందారు. ఇప్పుడు అలాంటి వారందరూ 60 సంవత్సరాల వయస్సు దాటి 70 పడికి మధ్య ఉన్నారు. 2014లో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున  గెలిచిన  వారిలో 10 నుంచి 15 వరకూ ఎమ్మెల్యేలు, ఎంపీలుగాను, ఎమ్మెల్సీలుగాను ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు స్వచ్చందగా రాజకీయాలను తప్పించే ఆలోచన తెలుగుదేశం పార్టీ అధినాయకత్వ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అరవై (60) సంవత్సరాలు వయస్సు దాటిన వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్లు నిరాకరించి, వారి స్థానాల్లో ఆయా నాయకుల కుటుంబాల్లో వారసులు ఉంటేకుమారులైనా, కుమార్తెలైనా వారికి అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలన్న ఆలోచన  జరుగుతోందని తెలుస్తోంది. చంద్రబాబు విఆర్ ఎస్ పథకం ఇలా ఆర్షణీయంగా ఉంటేనే సమస్యలుండవు.  ఇది ఒక విధంగా కంపల్సరీ రిటైర్ మెంటు పథకం కాకపోతే, గొల్డెన్ షేక్ హ్యాండ్.

యనమల రామకృష్టుడు, అశోక్ గజపతి రాజు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, బొజ్జల గోపాలకృష్టా రెడ్డి, పయ్యావుల కేశవ్. కోడెల శివప్రసాద రావు, కరణం బలరాం, జె సి దివాకర్ రెడ్డి, కె..కృష్ఠమూర్తి వంటి వారు పాత తరానికి చెందిన నేతలువీరి స్థానాల్లో వీరి వారసులుగా వారి కుమారులు, కుమార్తెలు దేశం వారసులు కావొచ్చు.. ఇదే జరిగితే తెలుగుదేశం పా\ర్టీలో కొత్త తరం వచ్చినట్లే !

 ప్రస్తుతం పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రిగా ఉన్న నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నాయకత్వ ంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం లో అంతా కొత్త ముఖాలే ఉండాలని ఆలోచన గా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇదే సాకారమైతే 2019 ఎన్నికలలో కొత్త తరం అదీ లోకేష్ తరం తెలుగుదేశం పార్టీపై ముద్ర వేస్తుండవచ్చు. దీని అర్ధం ఏమిటంటేతెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత ఎన్టీ ఆర్ ముద్ర, మూడు దశాబ్దాల  తర్వాత లోకేష్ ముద్ర అనివార్యమైతే చంద్రబాబు ముద్ర లేనట్టే !….

ఇది చాలా దూరదృష్టితో చంద్రబాబు కొడుకుకోసం తీసుకువస్తున్న పథకం. ఎందుకంటే, ఎన్టీఆర్ ముద్ర వున్నవాళ్లు, చంద్రబాబు ముద్ర వున్న పార్టీలో ఉంటే, వాళ్ళతో చిన్నబాబు వేగడం కష్టం.ఎందుకంటే, వాళ్లతో చర్చలు జరిపితే ఒక సమస్య, జరపక పోతే ఒక సమస్య. తల నెరిసినోళ్ల పార్టీలో ఉంటే మాట్లాడక తప్పదు. అందుకే పాత తలకాయలేవీ పార్టీలో లేకుండాచేస్తే, వచ్చే  ఈతరం వాళ్ల చిన్నబాబు సలహా ప్రకారం నడుచుకుంటారు. చిన్నబాబుకు నాయకత్వం ఇవ్వడం కాదు, ఆయనే నాయకుడని గుర్తించే  జనాన్ని చుట్టూ ర నిలబెట్టడం కూడా అవసరం. ఈ ఆలోచన నుంచి పుట్టిందే తెలుగు దేశం నిర్బంధ పదవీ విరమణ పథకం. ఇది నొప్పి లేకుండా కొనసాగేందుకు విఆర్ ఎస్ గా చేసి వారసులకు అవకాశం కల్పించి దీనిని గోల్డెన్ షేక్ హ్యాండ్ గా మార్చేశాడు చంద్రబాబు నాయుడు.

ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా, నలబై ఏళ్ళ రాజకీయ జీవితం చరిత్ర కలిగి ఉన్నానని చెప్పుకునే చంద్రబాబుకు రాజకీయ అనుచరులు, స్నేహితులు లేనట్టే కనిపిస్తోంది. ఒకందుకు అది ఇపుడు మేలే అయింది. లేకుంటే వాళ్లందరిని వదిలించుకోవడం ఇపుడు చాలా కష్టమయ్యేది.

 

 

 

(*గోసాల ప్రసాద్,  ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, మిర్రర్ టుడే , తెలుగు మ్యాగ్ జేన్)