Minister Gottipati Slams Jagan: జగన్‌పై మంత్రి గొట్టిపాటి సంచలనం: ‘ప్రాణ నష్టం జరగలేదనే జగన్ బాధేమో!’

మొంథా తుఫాను (Montha Cyclone) కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థకు జరిగిన భారీ నష్టాన్ని, దానిని పునరుద్ధరించడానికి తమ శాఖ తీసుకున్న వేగవంతమైన చర్యలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం.. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించిన ప్రకారం, మొంథా తుఫాన్ ధాటికి రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది.

13,000 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.

3,000 కిలోమీటర్ల మేర కండక్టర్ (వైరు) దెబ్బతింది.

3,000 ట్రాన్స్ఫార్మర్‌లు ప్రభావితమయ్యాయి.

ఈ స్థాయిలో నష్టం జరిగినా, విద్యుత్ శాఖ సిబ్బంది అలుపులేని కృషి వల్లే నష్టం జరిగిన 24 గంటల్లోనే ప్రధాన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించగలిగామని మంత్రి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు తుఫాన్ రాకకు రెండు రోజుల ముందే 1500 మంది సిబ్బందిని ప్రభావిత ప్రాంతాలకు మోహరించామని, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేయడం వల్లే వేగవంతమైన పునరుద్ధరణ సాధ్యమైందని చెబుతూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.

“వ్యవసాయం, ఆక్వా రంగాలకు సంబంధించిన విద్యుత్ స్తంభాలను మరో 48 గంటల్లో పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తాం,” అని మంత్రి హామీ ఇచ్చారు.

జగన్‌పై మంత్రి సంచలన వ్యాఖ్యలు: 
తుఫాన్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా ఖండించారు. విపత్తు నిర్వహణపై ఆయనకు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు.

గతంలో జగన్ రెడ్డి విపత్తు పరిశీలన అంటే ‘రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన’ వ్యక్తి అని ఎద్దేవా చేశారు. “తుఫాను వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదన్నది జగన్ బాదేమో” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాము పారదర్శకంగా, వేగవంతంగా పని చేశామని, ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో ముందుగానే కొన్ని చోట్ల భద్రత కోసం పవర్ షట్ డౌన్ చేయాల్సి వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో పనిచేసిందని ఉద్ఘాటించారు.

Google Data Center Secret?: Chintha Rajashekar | Adani Data Center | Telugu Rajyam