వైఎస్‌ జగన్‌ ‘భూ హక్కు – రక్ష’.. ఉద్దేశ్యం మంచిదేగానీ.!

Another prestigious event that came to the fore during the reign of YS Jagan

వైఎస్‌ జగన్‌ హయాంలో తెరపైకొచ్చిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘వైఎస్సార్‌ జగననన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం’. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. రాష్ట్రంలో భూ వివాదాలకు ఇకపై ఆస్కారం లేకుండా చేసేందుకుగాను ఈ పథకాన్ని తెరపైకి తెచ్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. నిజానికి, చాలా మంచి పథకమే ఇది. భూమి అమ్మకం, కొనుగోళ్ళు.. అంటే అదో పెద్ద తలనొప్పి వ్యవహారం. ఎంత పక్కాగా రిజిస్ట్రేషన్‌ జరిగినా వివాదాలు తప్పడంలేదు.

Another prestigious event that came to the fore during the reign of YS Jagan
Another prestigious event that came to the fore during the reign of YS Jagan

ఒకే భూమిని పది మందికి, పాతిక మందికి.. ఆ మాటకొస్తే, వందల మందికి అమ్మేసే ప్రబుద్ధులు వున్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పక్కాగా నమోదు కాబడిన భూముల్ని కూడా అక్రమార్కులు అమ్మేస్తుంటారు. ఈ తరహా అక్రమాలతోనే ఎంతోమంది రాజకీయ నాయకులు కూడా ఎదిగారన్నది అందరికీ తెలిసిన ‘పొలిటికల్‌ సీక్రెట్‌’. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవ్‌.. అన్ని రాజకీయ పార్టీల్లోనూ భూ బకాసురులుంటారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, ప్రత్యర్థులపై ‘వేట’ షురూ అయ్యేది ముందుగా ఈ భూ భకాసురుల పేరుతోనే. ఇదొక్కటి చాలు, అధికారాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయ నాయకులు ఏ స్థాయిలో భూముల్ని కొట్టేస్తుంటారో. మరి, అలాంటి భూ కబ్జాల వ్యవహారానికి ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష’ పథకం ‘ముగింపు’ పలుకుతుందా.? అన్నదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. రాష్ట్రంలో ప్రతి అడుగు భూమికీ పక్కాగా లెక్కలు ఈ సమగ్ర సర్వేతో నమోదవుతాయి. సో, ఏ భూమి ఎవరి పేరుతో వుందన్నది తేలిగ్గానే ప్రభుత్వానికి తెలుస్తుందన్నమాట. ఆన్‌లైన్‌లో అంతా పక్కాగా వుంటుంది గనుక, అసలు టాంపరింగ్‌కే అవకాశం వుండదన్నది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతున్న మాట. కానీ, ఇప్పటికే వున్న వివాదాల మాటేమిటి.? కొత్తగా సరిహద్దులు మార్చుకోవాల్సి వస్తే.. తద్వారా తలెత్తే సమస్యలకు పరిష్కారం లభించేదెలా.? అన్నిటికీ మించి, ప్రభుత్వం మారితే.. పథకం పేరు మారిపోతుందా.?

ఈ పథకం కింద ఇచ్చే పత్రాలు ఆ తర్వాత కూడా చెల్లుబాటవుతాయా.? కొత్త ప్రభుత్వం మళ్ళీ తమ నాయకుల పేర్లు, ఫొటోలతో మళ్ళీ పత్రాలు తీసుకొస్తే ఏంటి పరిస్థితి.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఇదిలా వుంటే, సరిహద్దు రాళ్ళకు సంబంధించి, ఇతరత్రా వ్యవహారాలకు సంబంధించి పెద్దయెత్తున ఖర్చు చేయబోతోంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. ఇంతా చేశాక, తర్వాతి ప్రభుత్వం కొత్తగా సరిహద్దు రాళ్ళను.. కొత్త కొత్త డిజైన్లతో ఏర్పాటు చేస్తామంటే.. దానికయ్యే ఖర్చు మాటేమిటి.? ఇన్ని సమస్యలా.? ఇంత గందరగోళమా.? అంటే, కథ ఇప్పుడే మొదలయ్యింది.. వివాదాలు ముదిరి పాకాన పడితే.. ఈ పథకం భవిష్యత్తేంటన్నది అనుమానాస్పదంగానే మారుతుంది. అయినాగానీ, మార్పు అనేది ఎక్కడో ఓ చోట మొదలవ్వాలి. భూ వివాదాలన్న మాటే విన్పించకూడదంటే.. ఖచ్చితంగా సమగ్ర భూ సర్వే జరిగి తీరాల్సిందే. అయితే, ఈ సర్వే సందర్భంగా అధికార పార్టీ నేతలు అడ్వాంటేజ్‌ తీసుకుంటారన్న విపక్షాల అనుమానాలపైనా ప్రభుత్వ పెద్దలు స్పష్టత ఇవ్వాల్సి వుంది.