కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన పాలకులు సమాజంలో ఒక వర్గాన్ని పూర్తిగా విస్మరించారు. ఫలితంగా కొన్ని లక్షల మంది ప్రజలు రోడ్లపై దిక్కుతోచని స్థితిలో జీవించారు. కొందరు నడుస్తూ, మరికొందరు రోడ్డువెంట బ్రతుకుతూ కనిపించిన దృశ్యాలు కూడా ఈ పాలకులను కదిలించలేకపోయాయి.
లాక్ డౌన్ ప్రకటిస్తున్న పాలకులు, ప్రజా రవాణా సదుపాయాన్ని నిలిపివేసి వలస కూలీలను రోడ్లపైకి తెచ్చారు. మార్కెట్లు మూసేసి వలస కూలీలకు ఆహారం దొరక్కుండా చేశారు. మొత్తం ప్రణాళికతోనే వలస కూలీలను విస్మరించారు.
ఏ పాలకుడు కూడా ఇలాంటి ఆలోచన చేయడు. లాక్ డౌన్ కొత్త విషయమే కావచ్చు. కరోనా వ్యాధి అంతకంటే కొత్త విషయం కావచ్చు. ఆ వ్యాధి నివారణకు లాక్ డౌన్ ఒక పరిష్కారం కావచ్చు. కానీ దేశ జనాభాలో ఒక వర్గం ప్రజలు ఇళ్ళల్లో కాకుండా పొట్టచేతపట్టుకుని రోడ్డుమీద ఉన్నారని గుర్తించలేకపోవడం పాలకుల దుర్నీతి లేదా ద్రుష్టి లోపం.
“ఇంట్లో ఉండండి. వీధిలోకి రాకండి. ఎప్పుడు బయటకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినా 20 సెకండ్ల పాటు చేతులు కడుక్కోండి,” అంటూ ప్రసంగాలు చెప్పిన నేతలు అసలు ఇంటికి వేలమైళ్ళ దూరంలో ఉన్న వలసకూలీల గురించి ఆలోచించకపోవడం మన పాలకుల అవిటితనం.
విదేశాల్లో చిక్కుకున్న ధనవంతుల్ని, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ధనవంతుల్ని కూడా ప్రభుత్వాలు ప్రత్యేక విమానాల్లో, బస్సుల్లో సొంత ఊర్లకు తరలించిన పాలకులు వలస కార్మికుల్ని విస్మరించడం అనాలోచితం కాకపోవచ్చు. రోడ్డుపై రోజూ కనిపిస్తున్న వలసకూలీలను పాలకులు చూడలేకపోవడం అంటే అది దృష్టిలోపం కూడా. మీడియాలో ప్రత్యేక కధనాలు వస్తున్నా వలస కూలీల విషయంలో పాలకులు స్పందించలేదు.
ఇప్పుడు లాక్ డౌన్ కు కొంత విరామం ఇచ్చిన పాలకులు వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్ళే సౌలభ్యం కల్పించడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా, ఇంటికి చేరిన కార్మికులు తినేందుకు ఆహార సదుపాయాలు కల్పించాల్సి ఉంది.
ఒక రకంగా ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కాస్త మానవత్వంతోనే పనిచేసిందనుకోవాలి. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత రెండు సార్లుగా పెన్షన్లు, రేషన్ ఇచ్చి పేద ప్రజలను ఆడుకుంది. గుజరాత్ లోనో మరో చోటో చిక్కుకున్న కార్మికులను రాష్ట్రానికి ప్రత్యేక బస్సుల్లో తెచ్చింది. ఇంతవరకూ అభినందించదగిన చర్యే. పాలకుడికి ఈ వర్గ ప్రజలపై ఆలోచన ఉండడం హర్షించదగ్గ విషయం. ఈ కోణం ఇతర పాలకుల్లో కనిపించకపోవడం దురదృష్టకరం.
