జగన్ పార్టీ బ్రాండ్ ఇమేజ్ మీద దెబ్బకొట్టే కుట్ర 

వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి రాజకీయాల్లో నిలబడగలగడానికి ప్రధాన కారణం ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్ట.  వైఎస్సార్ ఇమేజ్ మీద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించి మొదట ప్రతిపక్షంగా ఆ తర్వాత అధికార పార్టీగా స్థిరపడ్డారు.  జగన్ పార్టీ అంతలా తెలుగు ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకోగలగడానికి ప్రధాన కారణం పార్టీ వాడుక నామమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.  ఆ పేరు మూలంగానే ప్రజలు పార్టీని అంత గట్టిగా ఓన్ చేసుకోగలిగారు.  చాలామంది జనానికి ఇప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని తెలీదు.  వారి దృష్టిలో అనాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరునే జగన్ తన పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నాడని భావిస్తుంటారు.  
 
 
అలా తండ్రి పేరు వాడుకోవడానికి కొడుకుగా జగన్మోహన్ రెడ్డికి పూర్తి హక్కు ఉందని అంటారు కూడ.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే క్లుప్తమైన పేరు జగన్ గెలుపుకు గల కారణాల్లో ఒకటని నిస్సందేహంగా చెప్పొచ్చు.  అంతలా జగన్ పార్టీకి నైతిక బలాన్నిస్తూ వచ్చిన వైఎసార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుకే ఇప్పుడు ముప్పు వాటిల్లింది.  రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుతో ఏర్పడిన విభేదాల్లోనే పార్టీ వాడుక నామం మీద న్యాయ పరమైన చర్చ మొదలైంది.  తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిస్తే తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద విజయసాయిరెడ్డిగారు నోటీసులు పంపారని, ఇది తప్పుదోవ పట్టించే చర్యని ఎన్నికల సంఘానికి పిర్యాధు చేశారు రఘురామరాజు. 
 
 
దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుకు అసలు యజమాని మహబూబ్ భాషా తెర మీదకు వచ్చారు.  కడపకు చెందిన ఈయనకు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఒక పార్టీ ఉంది.  అన్ని నిబంధనలను అనుసరిస్తూ ఆ పార్టీ పేరు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికల సంఘం ఆమోదించింది.  ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును ఎక్కడా వాడకూడదని జగన్ బృందానికి ఎన్నికల సంఘం తెలిపింది.  మధ్యలో కూడా ఒకసారి మహబూబ్ బాషా జగన్ తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకుంటున్నారని, ఆ పేరు మీద సర్వ హక్కులు తనవని, ఇక మీదట అలా వాడకుండా హెచ్చరించాలని ఎన్నికల సంఘం వద్దకు వెళ్ళారాయన. 
 
 
మళ్లీ ఇప్పుడు రాఘురామరాజు వ్యవహారంతో ముందుకొచ్చిన మహబూబ్ బాషా ఈసారి నేరుగా ఢిల్లీ వెళ్లి కూర్చున్నారు.  సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.  ఎన్నికల సంఘం తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడొద్దని చెప్పినా వాడుతున్నారని, పార్టీ అధికారిక కార్యకలాపాల్లో కూడా అదే పేరు వాడుకలో ఉందని, అది నిబంధనలను ఉల్లంఘించడమేనని కాబట్టి వారి పార్టీ గుర్తింపును రద్దు చేయాలని పిటిషన్లో కోరారు.  కోర్టు సైతం పిటిషన్ను విచారణకు స్వీకరించింది.  ఈ విషయం జగన్ పార్టీకి న్యాయపరంగా చిక్కులు తెచ్చి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
 
 
 
 
ఒకవేళ మహబూబ్ బాషా వాదనే సరైందని కోర్టు భావిస్తే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపుకే ప్రమాదం.  ఇకపై ఆ పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పిలవకూడదని గట్టి తీర్పు వెలువడొచ్చు.  ఇన్నాళ్ళు ఎన్నికల సంఘం వరకే తన పిర్యాధులు తీసుకెళుతూ వచ్చిన అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళడం వెనుక పెద్ద శక్తులే ఉన్నాయని సులభంగా భోధపడుతోంది.  ఇదంతా ముమ్మాటికీ జగన్ పార్టీకి వైఎస్సార్ పేరు మీద వచ్చిన బ్రాండ్ ఇమేజ్ మీద దెబ్బకొట్టే ప్రయత్నమే.  కాబట్టి జగన్ తన లీగల్ బృందంతో ఈ కేసు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి పార్టీ పేరును కాపాడుకోవాలి.  లేదంటే గతంలో పలు కేసుల్లో తగిలినట్టే ఈ కేసులో కూడ ఎదురుదెబ్బ తగిలితే చాలా కష్టం.