గతంలో మున్నెన్నడూ లేని విధంగా రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం వెర్రి ముండ తలలు వేస్తోంది. తిలా పాపం తలా కొంచం అన్నట్లు ఈ దుస్థితికి అందరూ సమిధలు సమకూర్చుతున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వ వైఖరి కూడా అడ్డూ అదుపు లేకుండా వుంది. తదనుగుణంగా ప్రతి పక్షాల దూకుడు ఎక్కువగా వుంది.గత ప్రభుత్వ హయాంలో అవినీతి తవ్వి తీయడం తప్పు కాదు. కాని వ్యవహారం కక్ష పూరితంగా వుందనే విమర్శలు లేక పోలేదు. అంతేకాదు. ప్రభుత్వంపై ఏదైనా విమర్శలు చేసిన వారిపై కేసులు పెట్టడాన్ని టిడిపి యే గాక బిజెపి ఇతర ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. తుదకు అధికార ప్రతి పక్షాల వ్యూహ ప్రతి వ్యూహాల ఫలితంగా ప్రజాస్వామ్య లక్ష్మణ రేఖను అందరూ అతిక్రమిస్తున్నారు.
టిడిపి ఎమ్మెల్యే అచ్చమ నాయుడు గతంలో మంత్రిగా వున్న సమయంలో అవినీతికి పాల్పడింది లేనిది కోర్టులు తేల్చుతాయి. కేసు నమోదు చేయడం సహజం. టిడిపి న్యాయం పరంగా ఎదుర్కోవచ్చు. ఇదిలా ఉండగా అచ్చమ నాయుడు అరెస్టును బిసిలపై పగ తీర్చు కోవడంగా చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడం సమర్థనీయంగా లేదు. కులాల సెంట్ మెంట్ రగల్చడం సీనియర్ రాజకీయ వేత్తగా తగదు. ఏదైనా వుంటే రాజకీయంగా లేక న్యాయ పరంగా పోరాడాలి. అసలు సమస్యను పక్కదారి పట్టించి రాజకీయ లబ్ధికి బిసి ప్రస్తావన తెచ్చితే కుల గజ్జి రగిలించునట్లవుతుంది. ఈ ఎపిసోడ్ లో అరెస్టు మొదలు కొని ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయ్యేంత వరకు అధికార ప్రతిపక్షాలు సాగించిన తీరు ప్రజాస్వామ్య వాదులు తలవంచుకొనే విధంగా వున్నది.
అచ్చమ నాయుడు అరెస్టు అంశంలో తెలుగు దేశం బిసి కార్డు ఉపయోగించితే రాజ్యసభ ఎన్నికల్లో వర్ల రామయ్య ఓడిపోతాడని తెలిసి పోటీ పెట్టి ఎస్సీలకు టిడిపి ద్రోహం చేసిందని అధికార పక్ష నేతలు ఆరోపించారు. ఇది కులాల సెంట్మెంట్ రెచ్చగొట్టినట్లు కాదా? రాష్ట్రంలో కుల గజ్జి రెచ్చగొట్టడంలో దొందు దొందే. తుదకు అమరావతి రాజధాని కులాల కుంపటిలో భస్మం అవుతోంది. రాజకీయంగా వీళ్లు ఏమైనా మాట్లాడుకోవచ్చు. కులాల ప్రస్తావన తెచ్చి మొదలే కలుషితమై వున్న వ్యవస్థను మరింత భ్రష్టు పట్టిస్తున్నారు. మున్ముందు దీని ప్రభావం ఎంత తీవ్రంగా వుంటుందో వీరు ఆలోచించడం లేదు.
దీనికి తోడు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ రాష్ట్రంలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పడం అగ్నికి వాయువు తోడైనట్లయింది. వాస్తవంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పదవులన్నీ ఒక సామాజిక వర్గానికే కట్ట బెడుతున్నారనే ఆరోపణలు వున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక పక్క రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్రంతో పర మతాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించుతుంటే కేంద్ర బిజెపి నాయకత్వం కులాల కుంపటి ముందుకు తెచ్చింది. ఈ అంశంలో అధికార పక్షం కూడా ప్రతి పక్షాల విమర్శలకు తావీయకుండా వుంటే బాగుండేది.
ఉన్నత పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి చిల్లర పదవులు యస్సీ బిసి ఎస్టీ లకా అని ఇంత వరకు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తగా ప్రతి పక్షాలు అర కొర గొంతు విన్పించుతుండగా కేంద్ర మంత్రి ప్రకటనతో హాట్ టాపిక్ గా మారింది. ఈ కులాల కుంపట్లు రగులుకుంటే ప్రజల నిత్య జీవిత సమస్యలు పక్కకు పోయి సెంట్మెంట్ ముందుకు వస్తుంది. అంతేకాదు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అంతకు ముందు మరొక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంబంధాలకు ప్రతీకగా ప్రజలు భావిస్తున్నారు. తదుపరి మంత్రి నిర్మల సీతారామన్ పై వచ్చిన విమర్శలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా కావచ్చు. మొదలే ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రం కేంద్రంతో సఖ్యతగా లేక పోతే రెండు అధికార పార్టీల రాజకీయ లాభనష్టాలు అటుంచగా నిధులు లేకుండా అభివృద్ధి కుంటు పడతే అంతిమంగా ప్రజలు నష్ట పోవలసి వుంటుంది.
ఇదిలా వుండగా కుల మతాలకు అతీతంగా వుండే తమకు కులాల బురద అంటించుతున్నారని కులాలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కె. రామ కృష్ణ ఆరోపించడంతో రాష్ట్రంలో సంచలనమైంది. కుల గజ్జి వైరస్ వ్యాప్తి తీవ్రతను రామ కృష్ణ తెర మీదకు తెచ్చారు. ఈ లోపు ఉరుములు లేకుండా పిడుగులు పడినట్లు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ వాడిన పదజాలం “మూన్నాల్ల ముచ్చట “మున్ముందు కాపు రిజర్వేషన్ ఉద్యమ తీవ్రతను తెలియ జేస్తుంది. జన సేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత ఎన్నడూ మాట్లాడని విధంగా ఇటీవల కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడటం గమనంలోనికి తీసుకొంటే పరిస్థితి తీవ్రతను తెలియ జేస్తుంది. వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నోరెత్తి విమర్శలు చేసిన వారిపై వేటు వేస్తోంది. సెంట్ మెంట్ తో కూడిన కాపు రిజర్వేషన్ ముందుకు వస్తే వైకాపాకు చిక్కే. చంద్రబాబు నాయుడు హయాంలో ఇబిసిలకు కేంద్రం ఇచ్చిన పది శాతం కోటాలో అయిదు శాతం కాపులకు ఇస్తూ చట్టం చేసి కేంద్రానికి పంపారు.ఒక వేళ ఇది అమలు జరిగినా ఏకాభిప్రాయంతో ప్రశాంతంగా వుండాలి. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మా కోటాలో వారికెట్లా ఇస్తారని వాదించే పరిస్థితి తెచ్చుకుంటే రాష్ట్ర రావణ కాష్ఠం అవుతుంది.
రాజకీయ పార్టీలు తమ వ్యూహ ప్రతి వ్యూహాల మధ్య ప్రజలు పడే ఇబ్బందులకు నిదర్శనం ద్రవ్య వినిమయ బిల్లు. శాసన సభ ఆమోదం పొందిన తర్వాత శాసన మండలికి వచ్చింది. ఈ సందర్భంగా శాసన మండలిలో చోటు చేసుకున్న దృశ్యాలు పక్కన బెడితే ప్రభుత్వం కూడా ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకొని ముందుగా ద్రవ్య వినిమయం బిల్లు సభలో ప్రవేశపెట్టివుంటే భేషుగ్గా ఆమోదం పొంది వుండేది.ఈ రోజు వైకాపా టిడిపి ఒకరికొకరు ఎంత బదనాం చేసుకున్నా ఈ వాస్తవం అందరికీ తెలుసు. ఇదే జరిగి వుంటే ప్రభుత్వోద్యోగులకు ఈ నెల అయిదారు తేదీల్లో జీతాలు ఇచ్చే దుస్థితి వుండేది కాదు. కాని ద్రవ్య వినిమయం బిల్లు కన్నా ముందుగా రాజధానికి చెందిన బిల్లులు ఆమోదానికి ప్రభుత్వం సిద్ధంకాగా టిడిపి ప్రతి వ్యూహంతో అడ్డుపడింది. ఇందులో తప్పొప్పులు పక్కన పెడితే అధికార ప్రతి పక్షాల ఎత్తుగడలతో బడ్జెట్ నిధులు వినియోగంలో ఆలస్యం జరిగింది. వాస్తవంలో ఈ అంశంలో ప్రజలు ఎవరిని నిందించాలి? ఎవరి రాజకీయం వారిది. మధ్యలో ఇబ్బందులు పడేది ప్రజలు. మున్ముందు రాష్ట్ర రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి పొందే క్రమంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవేమో.
