రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడం ఒక పద్దతైతే వారికి ఎలివేట్ కావడానికి అవకాశం ఇవ్వకుండా పని చేసుకుంటూ పోవడం మరొక పద్దతి. అధికార పక్షాలు ఈ రెండు పద్దతుల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాల ప్రభావం ఎక్కువగా ఉన్న ఈరోజుల్లో రాజకీయాలు కూడా పోటీలుగా మారిపోయాయి. అందుకే ఇతరుల కంటే ఒకడుగు ముందే ఉండాలి. ప్రధాన అంశాల మీద సరైన సమయంలో స్పందించి ప్రజామోదం పొందగలిగే నిర్ణయాలను తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం మీద ప్రజలకు గురి కుదురుతుంది. వారు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా మంచి చేస్తాయనే నమ్మకం ఏర్పడుతుంది. అయితే అధికార వైసీపీ ఈ విషయంలో కొన్నిసార్లు తడబడుతోంది.
ఇదే జనసేనకు, పవన్కు వరంగా మారుతోంది. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం కొన్ని విషయాల్లో ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. వాటిని అమలుచేస్తే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని తెలిసి కూడా అమలుచేయడానికి పూనుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి వాటినే పవన్ వ్యతిరేకిస్తున్నారు. ప్రజానాడిని సరిగ్గా పట్టుకుని వారి మనసులో మాటనే తన మాటగా బయటపెడుతూ ప్రభుత్వం ముందు డిమాండ్లు పెడుతున్నారు. తీరా సర్కార్ మీనమేషాలు లెక్కబెట్టి తీసుకునే తుది నిర్ణయం పవన్ అభిప్రాయాలకు సరిపోతుండటం, ఆయన డిమాండ్లకు తలొగ్గి తీసుకున్నట్టు ఉండటంతో పవన్కు క్రెడిట్ దక్కుతోంది.
అందుకు తాజా ఉదాహరణే పదవ తరగతి పరీక్షలను ఏపీ సర్కార్ రద్దు చేయడం. పొరుగు రాష్ట్రాలన్నీ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా పది పరీక్షలను రద్దు చేసి విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తుంటే జగన్ మాత్రం పరీక్షలు నిర్వహించడానికి పూనుకుంది. పరీక్ష తేదీలను ప్రకటించి విద్యార్థులు, తల్లిదండ్రులను సంసిద్దం కావాలని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. దీంతో ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో జనసేన తరపున పవన్ ఈ ప్రమాదకర సమయంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం అంటే విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టడమేనని అంటూ ప్రభుత్వం మరోమారు మేధావులు, విద్యావేత్తలతో చర్చలు జరిపి నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
టీడీపీ కూడా ఇదే పని చేసినా పవన్ మాటలకు వచ్చినంత మైలేజ్ టీడీపీ మాటలకు రాలేదు. కారణం వైసీపీ శ్రేణులు ఇంటర్ ఫెయిలైన పవన్కు పదవ తరగతి పరీక్షల విలువ ఏం తెలుస్తుందని, పది మార్కులే చాలా పోటీ పరీక్షలకు కీలకమని పెద్ద ఎత్తున దాడి చేశారు. టెన్త్ స్టూడెంట్స్ మెరిట్ మేటర్స్ అంటూ పవన్ మాటలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ట్రెండ్ చేశారు. జనసైనికులు కూడా వైసీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా టెన్త్ స్టూడెంట్స్ లైవ్స్ మేటర్స్ అంటూ ట్రెండ్ చేశారు. దీన్ని గమనించిన న్యూట్రల్ నెటిజన్లు పవన్ ఇచ్చిన సలాహలో తప్పేముందని అన్నారు కూడ. ఇలా జనసేన, వైసీపీ శ్రేణుల నడుమ మాటల యుద్దం సాగుతుండగానే ప్రభుత్వం పది పరీక్షలు, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో చివరికి పవన్ మాటలే నెగ్గినట్టైంది.
జనసేన శ్రేణులైతే పవన్ డిమాండ్ మూలంగానే ప్రభుత్వం వెనక్కి తగ్గి పది పరీక్షలు రద్దు చేసిందని, ఇది జనసేన సాధించిన విజయమని తారాస్థాయి ప్రచారం చేస్తున్నాయి. అలాగే సంక్షేమ పథకాలకు నిధులు సమీకరించడం కోసం ప్రభుత్వ భూముల అమ్మాలని అధికార పక్షం విశాఖ, గుంటూరు జిల్లాలో 18.8 ఎకరాల భూమిని మార్క్ చేసి పెట్టుకుంది. ఈ అమ్మకాన్ని టీడీపీ, భాజపా, కమ్యూనిస్టు పార్టీలతో పాటు పవన్ కూడా వ్యతిరేకించారు. వ్యతిరేకించడంతో ఆగకుండా సర్కార్ అమ్మదలచిన భూముల్లో ఉన్న గుంటూరులోని పి.వి.కె నాయుడు మార్కెట్ ప్రాంతాన్ని అమ్మడం సరికాదని, సర్కార్ వెనక్కు తగ్గాల్సిందేనని జనసేన శ్రేణులు 10 రోజులు ఏకధాటిగా నిరసనలు చేశాయి.
దీంతో అమ్మకం భూముల్లో మార్కెట్ ప్రాంతాన్ని మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పోరాటంలో మాత్రం పూర్తి క్రెడిట్ జనసేనకే దక్కింది. గుంటూరులో ఆ పార్టీ ఇమేజ్ కూడా పెరిగింది. ఈ విధంగా పవన్ అభిప్రాయాలకు అనుగుణంగా సర్కార్ తుది నిర్ణయాలు ఉండటం ఆయనకు బాగా కలిసొస్తోంది. పవన్ ఇంకా ఎస్సీ కార్పొరేషన్ ఫెలిసిటేటర్లను ఆదుకోవాలని, ట్యాక్సీ డ్రైవర్ల కోసం పర్మిట్ ఫీజులు, రోడ్ ట్యాక్స్ రద్దు చేయాలని, ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లను ఆదుకోవాలని ప్రజానుకూల డిమాండ్లను లెవనెత్తి ఉన్నారు. వాటి విషయంలో కూడా సర్కార్ సానుకూల నిర్ణయాలే తీసుకునే వీలుంది. మొత్తం మీద కొన్ని విషయాల్లో జగన్ మొండితనం పవన్కు వరమవుతోందనే అనాలి.
