ఏబీఎన్ RK చేసిన ఆరోపణలు నిజం అవుతున్నాయా?

ఏబీఎన్ RK చేసిన ఆరోపణలు నిజం అవుతున్నాయా?

ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏబీఎన్ రాధాకృష్ణ తన పత్రిక ద్వారా అనేక రకాల  విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. అయితే ఆ ఆరోపణలన్నీ ఏదో తెలుగుదేశం పార్టీ కి లబ్ధి చేకూర్చడం కోసం చేసినటువంటి   ఆరోపణలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కొట్టి వేసేది.  

అయితే ఈ ఆరోపణలను పట్టుకొని తెలుగుదేశం పార్టీ మరియు మిగతా ప్రతిపక్షాలు వైయస్ జగన్ ప్రభుత్వం పై  టీవీ చర్చా కార్యక్రమాల్లో విమర్శలకు వాడుకొనేవారు . ప్రజలు వీటిని అంత సీరియస్ గా తీసుకునేవారు కాదు.  ఎందుకంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఎవరికోసం పనిచేస్తాయో అందరికీ తెలిసిన విషయమే. 

కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్ లో  తొలినాళ్ళలో చాలా తక్కువగా నమోదయ్యేవి.  పక్క రాష్ట్రాల్లో వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేవలం పదుల సంఖ్యలోనే కరోనా కేసులు ఉండేవి.  ఇదంతా వాలంటీర్లు ఆశావర్కర్లు ప్రభుత్వం కలిసి సాధించిన విజయంగా ప్రభుత్వం చెబుతూ వచ్చేది.   

అయితే కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ప్రవేశించినప్పటి నుండి ప్రభుత్వం పనితీరు పై రెండు ప్రధాన విమర్శలు ఆంధ్రజ్యోతిలో చేసేవారు.  ప్రభుత్వం చాలా తక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నారని అలాగే పాజిటివ్ కేసులు ప్రభుత్వం బహిర్గతం చేయకుండా దాస్తున్నారనేది ఈ విమర్శల సారాంశం. దీనిపై స్పందించిన వైసిపి నాయకులు రాధాకృష్ణకి జగన్ ప్రభుత్వం కరోనా వైరస్ ని సమర్థవంతంగా ఎదుర్కోవడం ఇష్టం లేదని ప్రజలలో భయబ్రాంతులకు గురి చేయడానికి ఇటువంటి రాతలు రాస్తున్నారని తిప్పికొట్టారు. 

ఈమధ్య దక్షిణ కొరియా నుండి ప్రభుత్వం  ఒక లక్ష కరోనా రాపిడ్ టెస్టింగ్ కిట్లు  దిగుమతి చేసుకుంది. దిగుమతి చేసుకున్న తర్వాత  రాష్ట్రంలో పరీక్ష సామర్థ్యం రోజుకు 2500 నుండి నాలుగు వేల వరకు పెరిగింది. సోమవారం 4000 పరీక్షలు చేయడంతో అనూహ్యంగా 76 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.  అంతకుముందు ప్రభుత్వ సామర్థ్యం 2500 వుండడంతో రోజువారి కరోనా పాజిటివ్ కేసులు చాలా తక్కువగా కనిపించేవి. 

దీన్ని బట్టి చూస్తే రాధాకృష్ణ మొదటి నుండి చేస్తున్న విమర్శలు ప్రభుత్వం చాలా తక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తుందని అందుకే తక్కువ కేసులున్నాయని చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం వుంది. అయితే రెండో విమర్శ ఏదైతే వుందో, ప్రభుత్వం కేసులు దాస్తుందనేది  నిజం కాదు ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం ఉంటే 76 కేసులు నమోదైనట్టు ప్రకటించాల్సిన అవసరం లేదు కానీ ప్రకటించింది అంటే ప్రభుత్వ పారదర్శకంగా ఉన్నట్టు తెలుస్తుంది. 

రాబోయే  వారంలో ప్రభుత్వ కరోనా పరీక్షా సామర్థ్యం 12 వేల వరకు పెరుగుతుందని సమాచార శాఖ మంత్రి  పేర్ని నాని ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని సోమవారం రోజు ప్రకటన చేశారు. పరీక్షల పెరిగితే రాధాకృష్ణ చెప్పినట్టు కేసులు నమోదు అవుతాయో చూడాలి.