కార్తీకమాసంలో శివకేశవుల ఆరాధన వల్ల కలిగే శుభ ఫలితాలు ఎన్నో..?

12 మాసాలలో చాంద్రమాసాన్ని అనుసరించి వచ్చే ఈ కార్తీకమాసానికి చాలా విశిష్టత ఉంది. ముఖ్యంగా కార్తీక మాసం ఆ పరమశివుడికి ఇష్టమైన మాసంగా పరిగణిస్తారు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ పరమశివుడితోపాటు మహావిష్ణువును కూడా ఆరాధిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో నది తీరంలో స్నానం ఆచరించి సూర్యోదయానికి ముందే ఆ శివకేశవులను ఆరాధించటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో ప్రతిరోజు తలంటు స్నానం చేసి ఆలయానికి వెళ్లి పరమేశ్వరుడిని, మహా విష్ణువుని పూజించాలి.

ఈ కార్తీకమాసంలో శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలు, జిల్లేడు పువ్వులతో శివుడిని ఆరాధిస్తూ ఆయన ముందు దీపం వెలిగించాలి. అలాగే ఆ మహా విష్ణువుకి ఇష్టమైన తులసి దళాలు, జాజి పువ్వులతో పూజిస్తూ ఆ మహావిష్ణువు ముందు దీపం వెలిగించాలి. ఇలా కార్తీకమాసంలో ప్రతిరోజు శివ కేశవులను ఆరాధించటం వల్ల పుణ్యం లభించి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం. ముఖ్యంగా ఈ కార్తీకమాసంలో ప్రతి రోజు కూడా ఎంతో పవిత్రమైన రోజు. ఈ మాసం మొత్తం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుని చూసిన తర్వాత భోజనం చేయడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది.

కార్తీక మాసం మొత్తం పూజలు చేయటానికి వీలు లేని వారు కార్తీకమాసంలో పర్వదినాలైన సోమవారం, పౌర్ణమి, ఏకాదశి, మాస శివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఆ శివకేశవలను పూజించి ఉపవాసం ఉండటం వల్ల కూడా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కార్తీకమాసంలో ” ఓం నమశ్శివాయ” అంటూ శివుడిని ఆరాధించటం వల్ల గత జన్మతోపాటు ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని ప్రజల విశ్వాసం. అలాగే “ఓం నమో నారాయణాయ” అనే మంత్రాన్ని పటిస్తూ మహావిష్ణువును ఆరాధించటం వల్ల ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది.