శిరస్సులేని అమ్మవారి విగ్రహం.. ఖంటానికి నీళ్లు పోస్తే కనకరించే ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా..?

మన భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న ఎన్నో దేవాలయాలకు చాలా విశిష్టత ఉంది. ఇలా విశిష్టత కలిగిన దేవాలయాలలో విశాఖపట్నంలోని దొండపర్తి లో ఉన్న శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి తల కాళ్ళ దగ్గర ఉండటమే ఇక్కడి విశిష్టత. అమ్మవారి విగ్రహానికి వెనక భాగంలో తల బదులు శ్రీ చక్రం ఉంటుంది. ఎక్కడైనా అమ్మవారికి చీర, పళ్లు, పంచబక్ష పరమాన్నాలను మొక్కుకుంటారు.కానీ విశాఖలో ఉన్న ఎరుకుమాంబ అమ్మవారికి నీళ్లు మొక్కుకుంటే చాలు.. అడిగిన వరాలు తీరుస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం.
ఉత్తరాంధ్ర సత్యం గల తల్లిగా ఈ ఎరుకుమాంబ అమ్మవారును భక్తులు కొలుస్తారు. ఈ అమ్మవారిని గౌరీ స్వరూపంగా భావిస్తారు.

ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే..ఏడో శతాబ్దం నుంచి ఎరుకమాంబ అమ్మవారు ఇక్కడ కొలువైయ్యారని స్థల పురాణం చెబుతోంది. గతంలో అక్కడ ఉన్న గ్రామ ప్రజలను రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఖాళీ చేయించారు. ఆ సమయంలో దేవత విగ్రహం ఎద్దుల బండి మీద పెట్టి తీసుకొస్తుంటే, ఆగిన చోట ఆలయం కట్టి విగ్రహం పెట్టాలని అనుకుంటున్న సమయంలో విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. అయితే వేరు పడిన అమ్మవారి శిరస్సు అతికించిన నిలవలేదు. మళ్ళీ భక్తులు అమ్మవారిని కొలవగా.. శిరస్సు కాళ్ళ దగ్గరే పెట్టి, కంఠానికి నీళ్లు పోస్తే.. చల్లగా చూస్తానని ఎరుకుమాంబ అమ్మవారు చెప్పినట్లు భక్తులు తెలిపారు. ప్రతి బుధవారం నాడు అమ్మవారిని పవిత్రమైన పసుపు నీటితో ఎవరు స్నానం చేస్తారో, వారి కోరికలు తీరుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం.

దీంతో వివిధ ప్రాంతాల నుండి మరియు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు బుధవారం స్నానోత్సవ వేడుకలకు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. భక్తులు ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:00 P.M నుండి 5:30 P.M. వరకు స్నానఘట్టాలను ఘనంగా జరుపుకుంటారు. గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. బుధవారం మాదిరిగానే, ప్రజలు గురువారం కూడా అదే పద్ధతిలో భక్తి శ్రద్ధలతో ఎరుకుమాంబ అమ్మవారును పూజిస్తారు.ప్రతినెలా మూడో గురువారం ఎరుకుమాంబ అమ్మవారి ఆలయ నిర్వాహకులు పేద ప్రజలకు అన్నదానం చేస్తారు. ప్రజల మధ్య ఉన్న వివక్షను తొలగించడానికి, ఎరుకుమాంబ అమ్మవారు ఆలయానికి ఎవరు వచ్చినా, వారి స్వంత మార్గంలో ఎరుకుమాంబ అమ్మవారును పూజించవచ్చని ధర్మకర్తలు నియమం పెట్టారు.