కోరిన కోరికలు తీర్చే ఈ గణపతి ఆలయానికి వెళ్లాలంటే ఆయన పిలిస్తే తప్ప వెళ్లలేం తెలుసా?

మన హిందూ సంస్కృతిలో పూజా విధానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ప్రజలు ప్రతిరోజు ఇంట్లో పూజ చేయటమే కాకుండా దేవాలయాలకు వెళ్లి దేవుని పూజిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు దేవుని ఆరాధించడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. అయితే కొంతమంది భక్తులు తమ కోరికలు నెరవేరడానికి ఆలయాలకు వెళ్లి ప్రదక్షిణలు ప్రత్యేక పూజలు ముడుపులు చెల్లిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా కోరిన కోరికలు నెరవేర్చి ఆ గణపతి ఆలయానికి వెళ్లాలంటే మనం వెళ్ళలనుకుంటే వెళ్ళలేము. కానీ ఆ గణపతి అనుగ్రహం ఉంటేనే ఈ ఆలయంలోకి అడుగు పెట్టగలం. ఇంతకీ ఇంతటి విశిష్టమైన ఆలయం ఎక్కడ ఉంది? దాని విశిష్టతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బెంగుళూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో కోలూరు జిల్లా ముళబాగిలు సమీపంలో కొలువై ఉన్న కురుడుమలై శక్తి గణపతి ఆలయానికి చాలా విశిష్టత ఉంది. 2000ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని చోళుల కాలంలో నిర్మించారు. ఏక సాలగ్రామ శిలతో చేసిన ఈ విగ్రహం సుమారు 14 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహాన్ని స్వయంగా త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు) ప్రతిష్టించారని ప్రతీతి. ఈ గణపతిని దర్శిస్తే కోరినా కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం. అందువల్ల ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు.

ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే.. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని గణపతి విగ్రహాన్ని త్రిమూర్తులు ప్రతిష్టించారని, త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్యవిఘ్నాలు తొలగించుకున్నారని ప్రతీతి. అలాగే పాండవులు కూడా ఈ శక్తి గణపతిని సేవించారని అక్కడి స్థలపురాణం చెబుతోంది.కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలో నేటీకి ఉన్నారని, ప్రతిరోజూ రాత్రి సమయంలో వచ్చి స్వామిని దర్శంచుకుంటారని, ప్రజల నమ్మకం. ఇప్పటికీ అర్థరాత్రి సమయంలో గుడిలోపలి నుంచి స్త్రోత్రాలు వినిపిస్తాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ గణపతిని దర్శించాలని మనం అనుకుంటే సరిపోదు. ఆయన అనుగ్రహం మనపై ఉంటేనే గణపతిని దర్శించుకుని అవకాశం ఉంటుంది.