జిమ్ కి వెళ్ళిన బాలిక ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసిన ట్రైనర్.. ఫోటోలు బయట పెడతానని బెదిరింపులు..!

ప్రస్తుత కాలంలో సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రేమ పేరుతో, స్నేహం పేరుతో ఎంతోమంది మహిళలని మోసం చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా మరి కొంతమంది స్నేహం పేరుతో అమ్మాయిలతో చనువుగా ఉంటూ వారికి తెలియకుండానే వారి ఫోటోలు వీడియోలు మార్కింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఘటనలు కూడా తరచూ వెలుగులోకి వస్తున్నాయి . తాజాగా సికింద్రాబాద్ లో కూడా ఇటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. జిమ్కి వెళ్లి వర్క్ అవుట్ లు చేస్తున్న యువతీతో క్లోజ్ గా ఉంటూ ఆమెకు తెలియకుండా ఫోటోలు తీసి వాటిని మార్ఫింగ్ చేసి జిమ్ ట్రైనర్ బెదిరింపులకు దిగాడు.

వివరాలలోకి వెళితే…సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిట్ నెస్ అర్ జోన్ జిమ్ లో ట్రైనర్ గా పనిచేస్తున్న రాజు జిమ్ కి వెళ్తున్న ఓ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. జిమ్ కి వచ్చే ఓ బాలికతో ప్రతిరోజు అనేక రకాల వ్యాయామాలు చేయించే క్రమంలో ఆ బాలికను తాకుతూ ఆమెకు తెలియకుండా వీడియోలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ వీడియోలను మార్కింగ్ చేసి బాలికతో సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు వీడియోలు సృష్టించాడు. వాటిని చూపించి బాలికని బెదిరింపులకు గురిచేస్తూ వేధించసాగాడు.

దీంతో ఫోటోలు బయటపడతాయని భయానికి గురైన సదరు బాలిక రాజు కోరిన విధంగా ఇంటి నుండి 20 తులాల బంగారుతో పాటు నాలుగు లక్షల రూపాయలు డబ్బు తెచ్చి అతనికి ఇచ్చింది. అయినప్పటికీ అతని వేధింపులు ఆగకపోవడంతో బాలికకు ఏం చేయాలో పాలుపోక జరిగిన విషయం మొత్తం తల్లిదండ్రులకు వివరించింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే బోయిన్ పల్లి పోలీసులను సంప్రదించి సదరు జిమ్ ట్రైనర్ మీద ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో జిమ్ ట్రైలర్ వేధింపులకు పాల్పడటం నిజమని తెలియడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు.